టీవీ ఛానెల్సే కొంప ముంచాయి!(హాట్ టాపిక్)

'తాజ్ హోటల్, నారిమన్ హౌజ్లో జరిగిన కమెండో ఆపరేషన్ను ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయడం వారికి బాగా కలిసొచ్చింది. వారి నాయకులనుంచి ఫోన్లలో అందే సూచనలను పాటిస్తూ పరిస్థితులకనుగుణంగా ఉగ్రవాదులు తగిన వ్యూహాలను రూపొందించుకున్నారు' అని భద్రతా అధికారులు వెల్లడించారు. తమవారితో సమాచార మార్పిడికి వారు సెల్ఫోన్లు, శాటిలైట్ ఫోన్లను ఉపయోగించారు.
దేశభద్రతతో ముడిపడి ఉన్న ఇలాంటి విషయాల్లో మీడియా సంయమనం పాటించాలని అధికారులు చెప్పారు. ప్రత్యేకించి టీవీ ఛానళ్లు పూర్తినిగ్రహం పాటించాలని కోరారు. 'కమెండోలు హెలికాప్టర్ ద్వారా నారిమన్హౌజ్పైకి దిగడం కోట్లాదిమందికి వినోదాన్ని కలిగించి ఉండవచ్చు. కానీ, అదే వారిపాలిట అపాయకరంగా పరిణమించింది' అని పేర్కొన్నారు. ముంబయి ఘటన ప్రత్యక్ష ప్రసారం ఇప్పటికే వివాదాస్పదంగా మారుతోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ దాద్లానీ దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన కోర్టులో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేశారు. టీవీ ఛానళ్లను న్యాయస్థానం మెట్లెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 'టీవీ ఛానళ్ల ప్రత్యక్షప్రసారం మన భద్రతా దళాలకు తీరని నష్టం కలిగించింది. దీనివల్ల చాలామంది ప్రాణాలుకోల్పోయారు, గాయాల పాలయ్యారు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నావీ ఛీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతా కూడా ఈ వాదనను సమర్ధిస్తూ..ఎలక్ట్రానికి మీడియా అతి ప్రవర్తనను దుయ్యబట్టారు. జనం చచ్చిపోతుంటే..క్షణ క్షణం లైవ్ టెలికాస్ట్ లు అవసరమా అంటూ మండిపడ్డారు.


Click it and Unblock the Notifications











