అబద్దం, క్షమాభిక్ష అడగలేదు: సంజయ్దత్
ముంబై : తనకు క్షమాభిక్ష పెట్టాలని తానెప్పుడూ మహారాష్ట్ర గవర్నర్ని కానీ ఇంకెవరిని కానీ కోరలేదని బాలీవుడ్ నటుడు సంజయ్దత్ అన్నారు. 1993 ముంబయి పేలుళ్ల ఘటనకు సంబంధించిన కేసులో సంజయ్ దత్ దోషిగా ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఆయనకు క్షమాభిక్ష ఇచ్చి.. శిక్షాకాలాన్ని తగ్గించాలంటూ రెండు సంవత్సరాల క్రితం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ లేఖ రాశారు. దానిని నిన్న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు కొట్టివేశారు. ఈ విషయంపై సంజయ్దత్ ఈరోజు వివరణ ఇచ్చారు.
తానెప్పుడూ క్షమాభిక్ష కావాలని కోరలేదని సంజయ్దత్ చెప్పారు. అన్ని వార్తా పత్రికల్లో సంజయ్దత్ పెట్టుకున్న పిటిషన్ని మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారని కథనాలు వెలువడ్డాయని.. అసలు సంజయ్దత్, ఆయన కుటుంబసభ్యులు ఎవరూ అలాంటి పిటీషన్ పెట్టుకోలేదని సంజయ్ తరపు న్యాయవాదులు హితేష్ జైన్, సుభాష్ జాదవ్లు స్పష్టంచేశారు.

వార్తల్లో ఏమి వచ్చిందంటే...
ముంబై 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు తిరస్కరించారు. ఈ విషయమై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ దాఖలుచేసిన దరఖాస్తుకు ప్రతికూలంగా రాష్ట్ర హోంశాఖ నివేదిక సమర్పించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం రాజ్భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం శిక్ష విధించినందున సంజయ్దత్కు క్షమాభిక్ష ప్రసాదించడం తప్పుడు సంకేతాలనిస్తుందని గవర్నర్కు రాష్ట్ర హోంశాఖ పంపిన నివేదికలో తెలిపింది. సంజయ్దత్ ఉగ్రవాది కాదని, కేవలం పొరపాటు మాత్రమే చేశాడని కట్జూ తన దరఖాస్తులో పేర్కొన్నారు. నిషేధిత ఆయుధం కలిగి ఉన్న కేసులోనే దత్ను దోషిగా నిర్ధారించారని తెలిపారు.


Click it and Unblock the Notifications











