లెజెండ్ : బోయపాటి రెమ్యూనరేషన్ తీసుకోలేదా?
హైదరాబాద్: బాలయ్యతో 'లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి శ్రీను భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బోయపాటి రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరో ఆశ్యర్యకర విషయం ఏమిటంటే ఈ చిత్రానికి ఆయన అసలు రెమ్యూనరేషనే తీసుకోలేదట.
అప్పట్లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'దమ్ము' చిత్రం బాక్సాఫీసు వద్ద బొల్తా పడటంతో బోయపాటితో సినిమా చేసేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తీస్తే మళ్లీ బాలయ్యతోనే సినిమా తీసి హిట్టు కొట్టాలని నిర్ణయించుకున్న ఆయన....రెండేళ్ల పాటు బాలయ్య కోసం వెయిట్ చేసారట.

భారీ బడ్జెట్తో సినిమా తీయాలనే ఉద్దేశ్యం ఉన్న బోయపాటి తన రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. 'లెజెండ్' చిత్రం బిజినెస్ పూర్తయ్యాక లాభనష్టలను బేరీజు వేసుకున్న తర్వాత నిర్మాతలు దర్శకుడికి ఎంతోకొంత ముట్టజెప్పే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
'లెజెండ్' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మించాయి. బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో జగపతి బాబు తొలిసారి విలన్ పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. లెజెండ్ చిత్రం ఇంకా విజయవంతంగా రన్ అవుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











