దర్శకుడు రాజమౌళి తండ్రి అరెస్టుకు రంగం సిద్దం!
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్కు కోర్టు తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆయనకు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తునప్నాయి.
'నరసింహుడు' కథ ఇస్తానని చెప్పి నిర్మాత చెంగల వెంకట్రావ్ వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు. సమయానికి కథ అందించక పోవడంతో పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే బకాయి పడ్డ డబ్బు చెల్లింపు కోసం ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో యలమంచిలి కోర్టులో నిర్మాత వెంకట్రావ్ కేసు దాఖలు చేశారు. దీంతో విజయేంద్ర ప్రసాద్కు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

పూర్తి వివరాలు ఇవీ...
నిర్మాత చెంగల వెంకట్రావ్ కొన్నాళ్ల క్రితం విజయేంద్ర ప్రసాద్పై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సినిమాకు కథ ఇస్తానంటూ తన వద్ద రూ.41లక్షలు తీసుకున్నారనీ, తర్వాత కథ విషయం పక్కనపెట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను 2005లో మరో రచయిత వద్ద కథ తీసుకుని 'నరసింహుడు' పేరుతో సినిమా విడుదల చేశానని చెప్పారు.
పోలీసులకు చెబుతానంటే... అరెస్టుకు భయపడి రూ.30లక్షల విలువైన రెండు చెక్కులు ఇచ్చారని, వాటిని బ్యాంకులో జమచేస్తే తగినన్ని నగదు నిల్వలు లేవంటూ డబ్బులు ఇవ్వలేదని వివరించారు. దీంతో, తాను సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా... కేసునమోదు చేశారనీ, విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై నాన్బెయిలబుల్ వారెంటు జారీచేసిందని చెప్పారు. యలమంచిలి కోర్టులోనూ విజయేంద్ర ప్రసాద్ పై చెక్బౌన్స్ కేసు పెండింగులో ఉండటంతో తాజాగా ఆ కోర్టు నుండి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
ఇక 2011 లోనూ సినిమాకు స్క్రిప్ట్ సిద్దం చేస్తానని చెప్పి విజయేంద్ర ప్రసాద్, నిర్మాత మేడికొండ మురళి వద్ద ఏడెనిమిది సంవత్సరాల క్రితం సుమారు 6-7 లక్షల రూపాయలు తీసుకుని వివాదంలో ఇరుక్కున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి విజయేంద్ర ప్రసాద్ ఏ పనీ చేయక పోయినప్పటికీ, తీసుకున్న సొమ్ము సైతం తిరిగి ఇవ్వలేదని మేడికొండ మురళి ప్రధాన ఆరోపణగా అప్పుడు తెలిసిందే.


Click it and Unblock the Notifications











