ఇది సుకుమార్ రివ్యూ, పొగడ్తలతో నింపేసారు (వీడియో)
హైదరాబాద్: విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దాదాపు రెండేళ్ల తరువాత వారాహి చలన చిత్రం బ్యానర్పై చేసిన మనమంతా చిత్రం ఆగస్టు 5వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో మోహన్లాల్, గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. రిలీజ్ రోజే ప్రముఖ దర్శకుడు రాజమౌళి చూసి మెచ్చుకోగా, ఇప్పుడు మరో ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం చూసి మెచ్చుకున్నారు. సుకుమార్ ఏమన్నారో ఈ క్రింద వీడియో చూడండి
ఇక 'మనమంతా' సినిమాకు వెళ్ళిన రాజమౌళి, ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.వారాహి చలన చిత్ర సంస్థ నిర్మించిన సినిమాలలో మరియు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన సినిమాలలో "మనమంతా" అనేది టాప్ క్లాస్ సినిమాగా నిలుస్తుందని, నటీనటుల నుండి అద్భుతమైన అభినయాలను రాబట్టడంలో చందు నైపుణ్యత గలవాడని, సూపర్ స్టార్ మోహన్ లాల్ నుండి నాలుగు సంవత్సరాల పిల్ల వరకు అద్భుతంగా నటించారని కితాబిచ్చారు.
'మనమంతా' సినిమా చాలాకాలం పాటు మదిలో నిలిచిపోతుందని, ఒక పుస్తకం మాదిరి ఎలా ప్రారంభమైందో అలాగే ముగిసిందని, ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ. తామూ 'మనమంతా' సినిమాకు పని చేసామని గర్వంగా చెప్పుకోవచ్చని. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు "మనమంతా" చిత్ర యూనిట్ కు మాంచి ఉత్సాహం ఇచ్చి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు.

సున్నితమైన మానవ సంబంధాలు, భావోద్వేగాలతో నిండిన మనిషి పెరుగుదలలో నాలుగు దశలైన బాల్యం, యవ్యనం, కౌమార, వృద్ధాప్య దశల్లో ఉన్న నలుగురు వ్యక్తుల జీవిత ప్రయాణమే ఈ చిత్రం.
ఈ చిత్రంలో మోహన్లాల్, గౌతమితో పాటు విశ్వాంత్, రైనా రావ్, అనీషా, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎల్.బి.శ్రీరాం, అయ్యప్పశర్మ, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ, నవీన్ నేని, ధన్ రాజ్, ప్రవీణ్, తదితరులు నటించారు.
రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి సంగీతం మహేశ్ శంకర్ అందిస్తుండగా, జీవీ చంద్రశేఖర్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం పేర్లతో విడుదల చేసారు.


Click it and Unblock the Notifications











