ఆ సినిమా వల్ల శాంతిభద్రతలకు ముప్పే: ముఖ్యమంత్రి హెచ్చరిక, తీవ్రరూపం దాల్చుతోన్న నిరసనలు
సంజయ్ లీలా భన్సాలీ సినిమా "పద్మావతి" విడుదలకు అభ్యంతరాలు తెలుపుతూ ఆ రాష్ట్రంలోని చిత్తోర్ఘర్లో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించి బంద్ను పాటించారు.
ప్రతీ సినిమానీ ఒక కళాఖండంలా తీయాలన్న తపన కనిపిస్తూ ఉంటుంది బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ లో. ప్రతీ ఫ్రేమ్లో లావిష్ గా, రిచ్నెస్ కనిపించేలా చాలా జాగ్రత్తలే తీసుకుంటాడు. బడ్జెట్ విషయం లోనూ అంతే భారీగా ఉంటాడు. అందుకే దాదాపుగా ఆయన తీసినవన్నీ పీరియాడిక్ మూవీలే అయిఉంటాయి. అయితే మన సినిమాల్లో చరిత్రను తెరకెక్కించడం కొత్త కాదు. సినిమాల్లో చరిత్రను వక్రీకరణపై వివాదాలూ కొత్త కాదు. ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తాజా సినిమా పద్మావతిపై వివాదం ముదిరింది.

చరిత్రను వక్రీకరిస్తున్నారు
చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ జైపూర్లో షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమా యూనిట్ పై కర్ణి సేన ఆధ్వర్యంలో దాడి జరిగింది. దీనిపై బాలీవుడ్ తీవ్రంగా స్పందించింది. ప్రముఖులందరూ భన్సాలీకి మద్దతు పలికారు. అయితే లొకేషన్ అక్కడినుంచి మార్చేసి తన సినిమాని పూర్తి చేసాడు సంజయ్. కానీ వివాదం మాత్రం చల్లారనే లేదు...

తీవ్ర ఆందోళనలు
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ వఘేలా ఈ చిత్ర దర్శకుడికి హెచ్చరికలు జారీ చేశారు. సినిమా విడుదలకు ముందు హిందు నేతలకు , క్షత్రియ నేతలకు ప్రత్యేక ప్రదర్శన వేయాలని, చరిత్ర వక్రీకరణ జరగలేదని వాళ్లకు అనిపిస్తేనే విడుదల చేయాలని ఆదేశించారు. అలా చేయని పక్షంలో తీవ్ర ఆందోళనలు ఉంటాయని హెచ్చరించారు.

శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని వార్నింగ్
పద్మావతి చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో చరిత్ర వక్రీకరణ జరిగిందనే వార్తలు వస్తున్నాయని.... అటువంటి అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతనే విడుదల చేయాలని ఆయన అన్నారు. అలా చేయకపోతే గుజరాత్లో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని వఘేలా వార్నింగ్ ఇచ్చారు.

గుజరాత్ ఎన్నికలపై ప్రభావం
'పద్మావతి' చిత్రం గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తోన్న బీజేపీ ఈ సినిమా విడుదలను కొంతకాలం వాయిదా వేయాలని కోరుతోంది. గుజరాత్లో వచ్చే డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అటు అధికార బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.

భారీ ఎత్తున ఆందోళనలు
పద్మావతి మూవీ విడుదలను నిలిపివేయాలని రాజస్థాన్లో నిరసనలు ఊపందుకున్నాయి.ఈ సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలుపుతూ ఆ రాష్ట్రంలోని చిత్తోర్ఘర్లో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించి బంద్ను పాటించారు.

రాజ్పుట్ కర్ణి సేన
చరిత్రను వక్రీకరించడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని రాజ్పుట్ కర్ణి సేన జాతీయ కన్వీనర్ ప్రమోద్ రాణా తేల్చి చెప్పారు. ఈ సినిమాలో దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్లు నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











