మా కుటుంబానికి పెద్దదిక్కు చిరంజీవే: పసుపులేటి రామారావు భార్య
సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్వో పసుపులేటి రామారావు మరణంతో సినీ లోకంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నిన్న (మంగళవారం) ఉదయం ఆయన మరణించారు. పసుపులేటి రామారావు మరణవార్త తెలిసిన వెంటనే చిరంజీవి సహా మోహన్ బాబు, నాని, సాయి ధరమ్ తేజ్, పలువురు ఇతర సినీ ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలియజేశారు.
నిన్న సాయంత్రం పసుపులేటి రామారావు మృతదేహాన్ని తన స్వగృహానికి తీసుకొచ్చి నేడు (బుధవారం) అంత్యక్రియల కార్యక్రమం చేపట్టారు కుటుంబ సభ్యులు. రామారావు మృతి చెందటంతో కన్నీరుమున్నీరైంది ఆయన భార్య వెంకటలక్ష్మి. ఆమెను ఓదార్చుతూ దైర్యం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

బాధలో ఉన్న వెంకటలక్ష్మి.. తమ కుటుంబానికి పెద్దదిక్కు మెగాస్టార్ చిరంజీవేనని చెప్పింది. రామారావు అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల నిమిత్తం చిరంజీవి లక్ష రూపాయల నగదు తనకు ఇచ్చినట్లు ఆమె చెప్పింది. గతంలో కూడా చిరంజీవి పలుమార్లు తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారని తెలిపింది. రామారావు రాసిన పుస్తకాల ప్రచురణ నిమిత్తం కూడా చిరంజీవి ఆర్థిక సహాయం రూపంలో సహకారం అందించారని చెప్పింది. ఇకముందు కూడా తమ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారని, ఆయనకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని వెంకటలక్ష్మి పేర్కొంది.


Click it and Unblock the Notifications











