వైఎస్ జగన్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించు.. సినీ పరిశ్రమపై నెగిటివ్ వద్దు.. ఆర్ నారాయణమూర్తి ఎమోషనల్
ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులు, థియేటర్ల మూసివేత గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పరిశ్రమ గుర్తింపు లభిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాల కారణంగా థియేటర్లు మూతపడుతున్నాయి. కాబట్టి ఈ సంక్షోభంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు జరిపాలి అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఆయన విన్నపం చేస్తూ..

తెలుగు సినిమా ఘనత ప్రపంచానికి
తెలుగు వాళ్లు సంక్రాంతి జరుపుకొంటారు. పశ్చిమ హిందూ, నార్త్ ఇండియాలో దీపావళీ జరుపుకొంటాం. ఈశాన్య రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటారు. బెంగాల్లో ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో.. ఆ గొప్ప తనాన్ని, ఆ కలకత్తా కాళిమాత నాలుక బీభత్సాన్ని శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రపంచానికి చూపించింది. అందుకు దర్శకుడు రాహుల్, నిర్మాత బోయినపల్లి వెంకట్కు ధన్యవాదాలు చెప్పాలి అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

ప్రపంచ సినిమాను జయించిన సత్తా
ఉత్తరాది నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి మణిరత్నం, శంకర్ లాంటి నిర్మాతలు, దర్శకులు, నటులు వస్తే తెలుగు మీడియా వారికి అపూర్వమైన స్వాగతం పలికేది. వారికి గొప్ప గౌరవాన్ని ఇచ్చేందుకు వెంపర్లాడేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలోని నిర్మాత, దర్శకులు, నటులు ముంబై, ఢిల్లీ, చెన్నైకి వెళ్తే జాతీయ మీడియా ఘనంగా, అరుదైన గౌరవాన్ని ఇస్తుంది. సినిమా ప్రపంచ సినిమాను జయించిన ఘనత తెలుగు నిర్మాతలకు, దర్శకులకు, నటులకు దక్కింది. మహా దర్శకుడు కే విశ్వనాథ్ శంకరాభరణం తీసి తెలుగు సినిమాను ప్రపంచపటంపై పెట్టారు. ఆ తర్వాత రాజమౌళి బాహుబలి తీసి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ కమర్షియల్ సత్తాను చాటారు అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

పైడి జయరాజ్ తర్వాత ప్రభాసే..
హిందీ సినిమా రంగంలో తెలుగు నటులు ఎవరూ నిలబడలేకపోయారు. ఇంతకు ముందు కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి, తెలుగు వాడు పైడి జయరాజ్ బాలీవుడ్లో తన సత్తాను చాటుకోవడమే కాకుండా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొన్నారు. ఆ తర్వాత రేఖ, వైజయంతి మాలా, శ్రీదేవి లాంటి వాళ్లు హీరోయిన్లు సక్సెస్ అయ్యారు. కానీ హీరోలు ఎవరూ అక్కడ జెండా ఎగురవేయలేకపోయారు. కానీ బాహుబలి దెబ్బకు ప్రభాస్ దుమ్ముదులుపుతున్నాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయికి వచ్చినందుకు ప్రభాస్కు మనంతమంతా సపోర్ట్ ఇవ్వాలి అని ఆర్ నారాయణ మూర్తి చెప్పారు.

పుష్పతో కేరళలో అల్లు అర్జున్ టాప్
ఇటీవల కేరళకు వెళ్లి చాలా చిన్న హోటల్ దిగాను. అప్పుడు ఇక్కడ టాప్ హీరోలు ఎవరు అని అడిగితే.. మోహన్ లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్ అని చెప్పారు. మలయాళంలో మన తెలుగువాడి సత్తా ఇది. ఒకప్పుడు షోలో, జంజీర్, భాషా సినిమాల్లో అమితాబ్, రజనీకాంత్ డైలాగ్స్ చెప్పుకొనే వారు. కానీ పుష్ప తర్వాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కొట్టిన డైలాగ్స్ను ప్రేక్షకులు దేశవ్యాప్తంగా చెప్పుకొంటున్నారు. అది మన తెలుగు హీరోల ఘనత. రాజమౌళి, సుకుమార్, రాహుల్ సంక్రిత్యన్ లాంటి దర్శకుల వల్ల సాధ్యమైంది అని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.

ఏపీలో ఏషియాలోనే నంబర్ వన్ థియేటర్ మూసివేత
తెలుగు హీరోలు ఓ వైపు తమ సత్తా చాటుతుండే.. ఇటీవల చోటుచేసుకొన్న కొన్ని విషయాలు నాకు ఏడుపు వచ్చింది. ఉత్తరాంధ్రలో కొన్ని థియేట్లరు మూతపడటం, అలాగే సూళ్లూరుపేటలోని ఏషియాలోనే అతిపెద్ద థియేటర్ ఈ మ్యాక్స్ అనేది మూసేశారు. అలాంటి థియేటర్లు ఎక్కువ సంఖ్యలో మూసేశారనే వార్తలు చూసి ఏడుపు ఆగడం లేదు. సినిమా అంటే.. సినిమా తీసే వాడు.. సినిమా చూసేవాడు.. సినిమా చూపించేవాడు బాగా ఉంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఫిలిం ఛాంబర్, మా అసోసియేషన్, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్, చిరంజీవి, నాగార్జునతోపాటు నాని లాంటి హీరోలకు విన్నపం చేసుకొంటున్నాను. థియేటర్లను మూసివేసే ప్రయత్నాలను ఆపాలి. కళామతల్లిని ఆదుకోవాలి అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

ఏపీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో
ఆంధ్ర ప్రదేశ్లో థియేటర్లు, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తే నేను ఆవేదనకు లోనవుతున్నాను. సినిమా పరిశ్రమపై నెగిటివ్ వద్దు.. ఎమోషన్లో నిర్ణయాలు తీసుకోవద్దు. సినిమ పరిశ్రమలోని సమస్యలను పాజిటివ్ యాటిట్యూడ్తో పరిశీలించి.. సినీ పెద్దలతో సంప్రదించాలి, సమస్యలను చర్చించాలి. థియేటర్లన్నీ తెరుచుకొనేలా చేయాలి. సిని పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సినిమా పరిశ్రమ అభివృద్ధి ఆకాశాన్ని అంటుతున్నది. అలాంటి ఆనందం కొనసాగాలంటే.. సినిమా తీసేవాడు. చూసేవాడు. చూపించే వాడు బాగుండాలని కోరుకొంటు ముగిస్తున్నాను అని ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











