'సాహో' నిర్మాతలపై పోలీస్ కేసు.. ఇంత మోసమా? ప్రభాస్ని వీడని కష్టాలు!
బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం 'సాహో'. ఓ రేంజ్ అంచనాల నడుమ దేశ విదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఆశిచిన ఫలితం రాబట్టలేక పోయింది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ సాహో రేంజ్లో కాసుల వర్షం కురిపించలేక పోయాయి. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశ చెందారు. ఇదిలా ఉండగా తాజాగా సాహోపై పోలీస్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు
సాహో ప్రొడ్యూసర్స్ వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్ లపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. బెంగుళూరుకు చెందిన ఔట్ షైనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సాహో నిర్మాతలపై కేసు నమోదు చేయడం సినీ వర్గాలకు, ప్రభాస్ అభిమానులకు షాకిచ్చింది.

ప్రధాన ఆరోపణ ఇదే..
ఔట్ షైనీ అనే బ్యాగుల తయారి సంస్థతో.. వాళ్ళ బ్రాండ్కి ప్రమోషన్ కల్పిస్తామని అగ్రిమెంట్ చేసుకున్న నిర్మాతలు మాటతప్పినట్టుగా సదరు సంస్థ ఆరోపిస్తోంది. తమ సంస్థ తయారు చేసిన బ్యాగులను సాహో సినిమాలో హీరో, హీరోయిన్స్ వాడుతున్నట్టు చూపిస్తామని చెప్పిన నిర్మాతలు మోసం చేశారంటూ వారు కేసు ఫైల్ చేశారు.

చెప్పిందొకటి.. చేసిందొకటి
గతేడాది జులై 8న సాహో నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నమన్నామని, ఆ ఒప్పందం ప్రకారం సాహో నిర్మాతలు తమ వద్ద 1.38 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నారని సదరు సంస్థ తమ ఫిర్యాదులో పేర్కొంది. సాహో సినిమాలో తమ ప్రొడక్ట్స్ చూపించకుండా చివరకు ఇలా మోసానికి పాల్పడ్డారని వాళ్ళు ఆరోపిస్తున్నారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఈ మేరకు ఆ బ్యాగుల తయారీ సంస్థ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెడ్ విజయరావు గురువారం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాహో నిర్మాతలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

భారీ బడ్జెట్.. ప్రభాస్, శ్రద్దా కపూర్
ప్రభాస్ హీరోగా దాదాపు 350 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ సాహో సినిమాను నిర్మించింది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్తో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించగా.. జాకీష్రాప్, చంకీపాండే, మందిరా బేడి కీలక పాత్రల్లో పోషించారు.


Click it and Unblock the Notifications











