నెం.1 అవ్వాలనే కోరిక తీరింది: రామానాయుడు
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, దాదా పాల్కే అవార్డు గ్రహీత డా. డి. రామానాయుడు నిర్మాతగా తన కెరీర్ పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారు. ఇటీవల ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం, అదే విధంగా 'లెజండరీ అచీవర్ ఆఫ్ ఇండియన్ సినిమా' అవార్డు అందుకోబోతున్న నేపథ్యంలో ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు.
ప్రెస్ నోట్ వివరాలు...
''భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలు నిర్మించి నెంబర్ వన్ నిర్మాత అనుకోవాలనుకున్నాను. ఈ మధ్య నిర్మించిన పంజాబీ చిత్రం 'సింగ్ వర్సెస్ కౌర్'తో ఆ లక్ష్యం నెరవేరింది. ఏ నిర్మాత చేయని విధంగా అన్ని భాషల్లో సినిమాలు నిర్మించగలిగినందుకు ఆనందంగా ఉంది.
పంజాబీలో నిర్మించిన 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం తెలుగులో నిర్మిస్తున్న చిత్రం 'పట్టుదల'. కుటుంబ సంబంధాలకు పెద్ద పీట వేస్తూ యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్చి దిద్దిన కథ ఇది. ఈ చిత్రానికి సునీల్ కుమార్ రెడ్డి దర్శకతం వహిస్తున్నారు.
నా సినిమాలకు పని చేసేది అగ్ర దర్శకుడా, స్టార్ కథానాయకుడా..లాంటి లెక్కలు వేసుకోను. కథ నచ్చితే చాలు ఎవరితోనైనా సినిమాలు నిర్మిస్తాను. నా కొడుకు, మనవళ్లతో కలిసి ఓ సినిమాలో నటించాలనే కోరిక ఉంది. త్వరలోనే అదీ నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఏప్రిల్ 4న పద్మభూషణ్ పురస్కారం స్వీకరించబోతున్నాను. అలాగే ఇన్ఫోకమ్ అసోచామ్ ఇ.యం.ఇ అవార్డ్స్ అదించే 'అజెండ్రీ అచీవర్ ఇండియన్ సినిమా' అవార్డుని అందుకోబోతున్నాను'' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











