'ఇద్దరమ్మాయిలతో' నెగిటివ్ టాక్ పై పూరీ స్పందన
హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం రిలీజైన నాటి నుంచి నెగిటివ్ టాక్ రన్ అవుతోంది. ఈ విషయమై పూరీ జగన్నాధ్ మీడియాకు వివరణ ఇచ్చారు.
పూరీ మాటల్లో... ''సినిమా విడుదలయ్యాక ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు.. అది సహజం. రకరకాల సమీక్షలు వస్తాయి. అంతెందుకు 'అవతార్' సినిమా విడుదలైనప్పుడు అందులో సన్నివేశాలు చూసి ఏంటీ సినిమా ఇలా ఉంది అంటూ చాలా మంది అన్నారు. అంటే ఆ సినిమా బాగాలేదు అన్నట్లు కాదు కదా! ఆ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇదీ అంతే. 'ఇద్దరమ్మాయిలతో' సినిమా గురించి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే సినిమా ఎలా ఉందో ప్రేక్షకులే చెప్తారు'' అన్నారు పూరి జగన్నాథ్.
ఇక సినిమాలో హింస ఎక్కువైందనే విషయమై చెప్తూ...''సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండకుండా చూసుకొన్నాను. అశ్లీలం లేకుండా జాగ్రత్త పడ్డాను. పోరాటాల్లో తగిలే దెబ్బలు.. వచ్చే రక్తం చూసి హింస ఎక్కువగా ఉందంటే ఏం చేయగలం? అవి ఉంటేనే ఫైట్ అంటారు. లేకపోతే ఏమంటారో నాకు తెలియదు'' అన్నారు.
అలాగే ''ఫైట్స్లో అల్లు అర్జున్ డూప్ లేకుండానే చేశారు. ఈ సినిమాలో ఒక్కో ఫైట్ ఒక్కో తరహాలో ఉంటుంది. కొత్తదనం కోసమే అలా చేశాం. ఇప్పుడు పాటల్లో ఎలా అయితే ప్రేక్షకులు వివిధ రకాలు కోరుకుంటున్నారో.. ఫైట్స్లోనూ అంతే. అందుకే అలా చేశాం. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. నిర్మాత బండ్ల గణేష్ ఏ దశలోనూ రాజీపడలేదు'' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











