జియో ఫైబర్ ఫస్ట్ డే ఫస్ట్ షో... ఆందోళనలో మల్టీప్లెక్స్ యజమానులు!
జియో ఫైబర్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ మున్ముందు సంచలన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగా ప్రీమియం కస్టమర్లకు జియో ఫైబర్ ద్వారా కొత్తగా రిలీజైన సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అవకాశం కల్పించబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ సంస్థ నుంచి ఆ ప్రకటన వచ్చిన ఒక రోజులోపే మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్లో దేశంలో అగ్రగామిగా ఉన్న ఐనాక్స్, పివిఆర్ సంస్థలు స్పందించాయి. జియో ఫైబర్తో నేరుగా కొత్త సినిమాలు ఇంట్లోనే చూసే అవకాశం కల్పించడం వల్ల థియేటర్ బిజినెస్ మీద ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇండియన్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, మల్టీప్లెక్స్ యజమానులు ఇప్పటికే సినిమాల ప్రదర్శన విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారని, సినిమాలు థియేటర్లో ఎనిమిది వారాల పాటు ప్రదర్శించిన తర్వాతే ఇతర మాధ్యమాల్లో విడుదల చేయాలని భావిస్తున్నారని ఈ సందర్భంగా ఐనాక్స్, పీవీఆర్ సంస్థలు స్పష్టం చేశాయి.
సినిమా కంటెంటుకు యజమాని నిర్మాతే. దాన్ని ఎక్కడ విడుదల చేయాలనేది నిర్ణయం వారిదే. అయితే జియో ఫైబర్ నిర్ణయం వల్ల సాంప్రదాయ థియేటర్ బిజినెస్ మీద ప్రభావం పడుతుందని పివిఆర్, ఐనాక్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఫిక్కీ నివేదిక ప్రకారం వినోద రంగం ద్వారా వచ్చిన ఆదాయం రూ.17,450 కోట్లు. ఇందులో 75 శాతం బాక్సాఫీస్ బిజినెస్ ద్వారా వచ్చిందే. రిలయన్స్ జియో ఫైబర్ ద్వారా నేరుగా ఇంట్లోనే సినిమా చూసే అవకాశం వస్తే ఈ ఆదాయానికి గండి పడుతుందని వారు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











