కాపీ కొట్టారా? వెంకీ-మారుతి ‘రాధా’ స్టోరీ వివాదం!
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రాధా'. ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న ఈచిత్రం తాజాగా వివాదంలో ఇరుక్కుంది. ఈ స్టోరీ తనదే అంటూ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ రచయితల సంఘాన్ని ఆశ్రయించాడు. దీంతో దర్శకుడు మారుతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.
'తాను ఎవరి కథను కాపీ కొట్టలేదని, ఒకే ఆలోచన ఇద్దరికీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక వేళ తన కథ..వేరొకరి కథను పోలి ఉన్నట్లు ఉంటే మార్పులు చేస్తాను. తుది నిర్ణయం రైటర్స్ అసోసియేషన్ తీసుకుంటుంది. ఈ వివాదం క్లియర్ అయ్యే వరకు సినిమా షూటింగ్ మొదలు పెట్టను' అని మారుతి స్పష్టం చేసారు.

లక్ష్మి, తులసి లాంటి బ్లాక్ బస్ట్ హిట్ చిత్రాల తరువాత హ్యాట్రిక్ కాంబినేషన్ తో విక్టరీ వెంకటేష్, నయనతారలు జంటగా దర్శుకడు మారుతి దర్శకత్వంలో నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం 'రాధా'. డి. పార్వతి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 6న నిర్వహించారు.
ఇందులో వెంకటేష్ హోం మినిస్టర్గా, నయనతార మధ్య తరగతి అమ్మాయిగా నటిస్తుంది. వీరి మధ్య సాగే ప్రేమకథతోనే ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వరుస హిట్ చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సనిమా కావడం, వెంకీ-నయనతార లాంటి హిట్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈచిత్రానికి సమర్పకులు : డి. పార్వతి, సంగీతం: జె.బి, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: ఉద్ధవ్, నిర్మాత : డివివి దానయ్య, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మారుతి.


Click it and Unblock the Notifications











