నాగ్ రాజన్నపై అమెరికా ఎన్నారైల టాక్...
నాగార్జున నటించిన 'రాజన్న' సినిమా అమెరికాలో ఈ రోజే విడుదలైంది. మన దగ్గర మాత్రం రేపు విడుదల కానుంది. అక్కడ సినిమా చూసిన వారు రాజన్న సూపర్ హిట్ అంటున్నారు. మంచి రేటింగ్ కూడా ఇచ్చేశారు. నాగార్జున సినీ కెరియర్లో ఇదో మైలురాయిగా మిగిలిపోతుందని అంటున్నారు.
సినిమా మొత్తం మల్లమ్మ(బేబీ ఆని) చుట్టూ తిరుగుతుంది. తన పాత్రలో మల్లమ్మ అద్భుతంగా నటించింది..కాదు కాదు జీవించింది. ఈ విడ పోషించిన పాత్రకు నంది అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక నాగార్జున పోషించిన పవర్ ఫుల్ రోల్ సినిమాకు హైలెట్. ఎలాంటి పాత్రనైనా నేను అద్భుతంగా చేయగలనని నాగ్ మరోసారి మరోసారి నిరూపించాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన యాక్షన్ సన్నివేశాలు హై రేంజ్ లో ఉన్నాయి. స్నేహ పాత్ర పరిమితమే అయినా ప్రేక్షకులను మెప్పించింది. దొరసాని పాత్రలో శ్వేత మీనన్ తన పాత్రకు తగిన విధంగా నటించింది.
సంగీతం, టెక్నికల్ విషయాలకొస్తే...
కీరవాణి అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరు సినిమాకు అదనపు ఆకర్షణ. రాజన్న మోగించే డబ్బుకు కీరవాణి అందించిన దరువు అదరహో... అనేలా ఉంది. విజయేంద్రవర్మ తన దర్శకత్వ బాధ్యతలు పర్ ఫెక్టుగా నిర్వర్తించాడు. 1948 నాటి పరిస్థితులను అద్భుతంగా చూపించారు. దొరల దారుణాలను, రజాకార్ల రాక్షసత్వాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారు. రాజమౌళి యాక్షన్ పార్టు ఆయన శైలికి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తదితర అంశాలు కూడా కూడా సమర్థవంతంగా ఉన్నాయి.
కథలోకి వెళితే.....
1948 ప్రాంతంలో నేలకొండపల్లిలో చోటు చేసుకున్న యాదార్ధ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. తన పాటతో, డప్పు వాయిద్యంతో ప్రజల్లో చైతన్యాన్ని నింపే రాజన్న(నాగార్జున) అతని స్నేహితులు(ప్రదీప్ రావత్, సుప్రీత్, అజయ్) కలిసి బ్రిటిష్ ఎదురు నిలిచి తెల్లదొరలను చంపుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగం అవుతారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజన్న తన సొంత ఊరైన నేలకొండపల్లికి చేరుకుంటారు. లచ్చమ్మ(స్నేహ)ను పెళ్లి చేసుకుంటాడు. వీరి సంతామనమే మల్లమ్మ(బేబి ఆనీ).
దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పరిపాలనలో ఉన్న ప్రాంతం(ఇప్పటి తెలంగాణ)కు మాత్రం స్వాతంత్ర్యం రాదు. గ్రామాల్లో దొరల నిరంకుశత్వం సాగుతూ ఉంటుంది. ఇది సహించలేని రాజన్న వారికి ఎదురు తిరుగుతాడు. ఒక్కొక్క దొరను చంపుతూ ముందుకు సాగుతున్న రాజన్న నిజాం మనుషుల చేతిలో బలవుతాడు.
రాజన్న మరణంతో అతని కుటుంబాన్ని కూడా తుదముట్టించాలని చూస్తారు దొర కుటుంబీకులు. రాజన్న భార్య లచ్చమ్మ ఎలాగో అలా దొరల భారి నుంచి తన కూతురు మల్లమ్మను కాపాడి తాను బలవుతుంది. మల్లమ్మను అదే ఊరిలో ఉండే ఓ తాత కాపాడి తన మనవరాలిగా పెంచుకుంటుంటాడు. అలా పెరిగి పెద్దయిన మల్లమ్మ తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం నింపుతూ ఉంటుంది. ఈ క్రమంలో దొరల ఆగ్రహానికి గురవుతుంది. నేలకొండపల్లిపై పగబట్టిన దొరలు ఊరుమొత్తాన్ని మట్టుబెట్టాలని చూస్తారు. తన ఊరిని కాపాుడకోవడానికి మల్లమ్మ ఢిల్లీ బయల్దేరు తుంది. అప్పటి దేశ ప్రధాని నెహ్రూను కలుస్తుంది. ఆతర్వాత ఏం జరిగిందో థియేటర్లో.....చూసి తెలుసుకోండి.
తారాగణం : నాగార్జున, స్నేహ, బేబి ఆని, నాజర్, ప్రదీప్ రావత్, సుప్రీత్, అజయ్, శ్వేత మీనన్, ముఖేష్ రిషి, రవి కాలె తదితరులు
బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాత : అక్కినేని నాగార్జున
దర్శకత్వం : విజయేంద్ర ప్రసాద్
యాక్షన్ పార్టు దర్శకత్వం : రాజమౌళి
సంగీతం : ఎంఎం కీరవాణి
లిరిక్స్ : కె శివదత్త, అనంత శ్రీరాం, సుద్దాల అశోక్ తేజ, సురేందర్ మిట్టపల్లి, చైతన్య ప్రసాద్


Click it and Unblock the Notifications











