నేను ఆ..టైపు కాదు బాబోయ్ : రాజేంద్రప్రసాద్
మొగుడు చిత్రంలో తండ్రి పాత్ర వేశాను కదా అని ఇక రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలకే పరిమితమైపోతారు అనుకుంటే అది పొరబాటు. నాకు బ్రాండ్లు నచ్చవు. నేను ఒకేలాగ ఉండను. అందుకే ప్లీజ్, నన్ను బ్రాండ్లో ఫిక్స్ చేయొద్దు. 'ఎర్రమందారం', 'కాష్మోరా', 'ఆ నలుగురు'... వంటివన్నీ వైవిధ్యమైన చిత్రాలు. నాకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించే కథలను ఒప్పుకుని చేస్తాను.... అంటూ వ్యాఖ్యానించారు ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
నేను నటన గురించి చదువుకుని ఈ రంగంలో అడుగుపెట్టిన వాడిని. నేను, సిల్క్స్మిత కలిసి నటించిన చిత్రంతో కృష్ణవంశీ అసిస్టెంట్ దర్శకుడిగా అడుగుపెట్టాడు. నేను చాలా మంది దర్శకులతో పనిచేశాను. కృష్ణవంశీ శైలి ప్రత్యేకమైనది. షాట్లో అక్కడికక్కడే సన్నివేశాన్ని చెప్పి జీవించమంటాడు, నటుడిని గిల్లి మంచి ఎక్స్ప్రెషన్స్ రప్పించుకుంటాడు. అలా గిల్లే దర్శకుడంటే నాకు చాలా ఇష్టం...అని చెప్పుకొచ్చారు. నేను రోజుకు 18 గంటలు నటనను నమ్ముకున్నవాణ్ని. నటన కోసం నా పిల్లలను కూడా పట్టించుకోలేదు. ఆ బాధ్యత మొత్తం నా శ్రీమతే చూసుకుంది. నిత్యం పనిలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటాను. పరుగులు పెట్టడం అలవాటు. కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రోజుకో గెటప్ వేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉందని తన మనసులోని మాటను వెలుబుచ్చాడు మన రాజేంద్రుడు.


Click it and Unblock the Notifications











