సూపర్ స్టార్ స్టాటజీ : అభిమాన సంఘాలతో భేటీ...అభిప్రాయ సేకరణ
చెన్నై : శుక్రవారం జయలలితకు బెయిల్ వస్తుందా లేదా అనే విషయం కన్నా తమిళనాట మరో హాట్ టాపిక్ నడుస్తోంది. అదే రజని పొలిటికల్ ఎంట్రీ. కుల, మత, వర్గ, వర్ణ భేదాలకు అతీతంగా ప్రజాదరణను సొంతం చేసుకున్న నటుడు రజనీకాంత్. సహనటుల అభిమానులు సైతం అభిమానించేలా.. తనదైన స్టెల్ను ప్రదర్శించే 'బాషా'కు తమిళనాడులో తిరుగులేదనే చెప్పాలి. ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ద్రవిడ పార్టీలు ప్రారంభం నుంచే కృషి చేస్తున్నాయి.
అయినా.. 'దైవాజ్ఞ కోసం ఎదురుచూస్తున్నా'నంటూ సూపర్స్టార్ దాటవేశారు. కొన్నేళ్లక్రితం భాజపాకు పరోక్షంగా మద్దతు పలికారు రజనీ. అప్పటి నుంచే భాజపాతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు వాజ్పేయి తర్వాత.. అద్వానీ కూడా రజనీతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. ఇప్పుడు అమిత్షా, మోడీ కూడా రంగంలోకి దిగారు.
ఇంతకీ తమిళనాట ఏం జరుగుతోంది. మీరే సెలవివ్వండి అంటూ... అభిమానుల అభిప్రాయ సేకరణలో 'తలైవర్' ఉన్నారా...త్వరలోనే సంఘాలతో భేటీ అనేది నిజమేనా వంటి విషయాలు స్లైడ్ షో లో...

స్పందించారు
సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాలపై దృష్టిపెట్టారా?.. పూర్తిస్థాయిలో కాకపోయినా.. ప్రాథమిక పనులకు శ్రీకారం చుట్టారనే అంటున్నాయి ఆయన అభిమాన వర్గాలు. 'మీరు సరేనంటే.. సీఎం అభ్యర్థి మీరే'నని భాజపా ఇచ్చిన 'బంపర్ ఆఫర్'పై రజనీకాంత్ స్పందించినట్లు తెలుస్తోంది.

అభిమానులతో భేటి
దీనిపై అభిమానుల మనోగతాన్ని తెలుసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు సూపర్స్టార్. త్వరలోనే అభిమానసంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

పునాది పడినట్లే...
ఇదిలా ఉండగా.. 2016 ఎన్నికలే లక్ష్యంగా.. రజనీకాంత్ను బరిలోకి దింపే యత్నాలకు పునాదిరాయి పడినట్లేనని భాజపా భావిస్తోంది.

ఇదే అదును..
ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భాజపా తమిళనాట పాగా వేసేందుకు కృషి చేస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేల తర్వాత రాష్ట్రప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ తమదేనని విస్తృతంగా ప్రచారం కూడా సాగిస్తోంది.

వ్యతిరేక వార్తలు వద్దు
అంతేకాకుండా.. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించిన వ్యతిరేక వార్తలకు తావివ్వొద్దంటూ మీడియాను కూడా కోరుతోంది ఆ పార్టీ రాష్ట్రవిభాగం. ప్రాథమికంగా ఇలాంటి చర్యలను తీసుకుంటున్న భాజపా.. వీలైనంత త్వరగా రజనీకాంత్ను పార్టీలోకి తీసుకురావాలని భావిస్తోంది.

అమితాషా మరో సారి
అందుకే నెలక్రితం రజినీతో ఫోన్లో మాట్లాడిన అమిత్షా.. త్వరలో నేరుగా భేటీ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. మోడీ, అమిత్షాలు కలసి రజనీకాంత్తో భేటీ కావొచ్చనే ఊహాగానాలు కూడా తమిళనాట వినిపిస్తున్నాయి.

'తలైవర్' దారెటు?
'దైవమే ఆదేశించాలి..' అంటూ తన రాజకీయ అరంగేట్రం గురించి చెప్పే రజనీకాంత్.. ఈ అంశాన్ని దేవుడిగా భావించే అభిమానుల విచక్షణకే వదిలేశారు. వారి అభిప్రాయాన్ని బట్టే రాజకీయ అరంగేట్రంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీలైనంత త్వరలోనే...
'అభిమానుల అభిప్రాయం తెలుసుకోవాలి'.. అని రజనీకాంత్ భావించిన విషయం ఇప్పటికే అభిమాన సంఘాల్లో షికార్లు చేస్తోంది. వీలైనంత త్వరలో తమ 'తలైవర్' భేటీ కాబోతున్నారని వారు ఆశిస్తున్నారు.

రాజకీయాల్లోకి రావాలని...
అభిమానుల విషయానికి వస్తే.. తమ ఆరాధ్యతార రాజకీయాల్లోకి రావాలని వారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఒకవేళ 'రోబో' ఒప్పుకుంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాష్ట్రానికి సీఎం కావడం ఖాయమని ఆయన అభిమానులు చెబుతున్నారు.

లింగా తర్వాత...
'లింగా' విడుదల తర్వాత రాజకీయ అరంగేట్రంపై రజనీకాంత్ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చని తెలుస్తోంది.

రాష్ట్రపార్టీ నాయకుల చేరువ
రజనీకాంత్ను భాజపాలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర విభాగం తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభాగ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ శుభకార్యక్రమాలకు హాజరై కుటుంబపరంగా ఉన్న స్నేహసంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నారు.

అంతేకాకుండా..
ఇల.గణేశన్ కూడా రజనీకాంత్తో మాట్లాడే పనిలో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక మాజీముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కూడా రజనీకాంత్ను భాజపాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











