రజనీ దిష్టిబొమ్మ దగ్ధం...'లింగా' షూటింగ్ ఆపాలి
రామనగర : కావేరి నదీ జలాల వివాదంలో కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీకాంత్కు రాష్ట్రంలో చిత్రీకరణలో పాల్గొనే నైతికత ఎక్కడుందని కన్నడ సంఘాల కార్యకర్తలు ప్రశ్నించారు. ఇక్కడికి సమీపంలోని ఐజూరు గ్రామంలో కస్తూరి కన్నడ సంఘం కార్యకర్తలు రజనీకాంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత ఏడాది కావేరి వివాదం సందర్భంలో రజనీకాంత్ తమిళనాడుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే ఈ ఆక్రోశానికి కారణం.
ఇలాంటి వ్యక్తిని హీరోగా పెట్టుకుని సినిమాను రూపొందిస్తున్న నిర్మాత రాక్లైన్ వెంకటేష్ను విమర్శించారు. రజనీకాంత్ హీరోగా లింగ సినిమా చిత్రీకరణ మండ్య జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. శనివారం ఈ సినిమా చిత్రీకరణను శ్రీరంగపట్టణ సమీపంలో కొనసాగించారు. ఆ ప్రదేశంలోకి అభిమానులతో పాటు మీడియాను దూరం ఉంచారు. రజనీకాంత్ మనవడు (ధనుష్- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.

రజనీకాంత్ కొత్త సినిమా 'లింగా' చిత్రీకరణ మైసూర్లోని చాముండీ హిల్స్లో శుక్రవారం ప్రారంభమైంది. పట్టుపంచె, చొక్కా ధరించి, మెలితిరిగిన మీసంతో రజనీ కొత్త గెటప్లో కనిపించారు. తొలి సన్నివేశాన్ని చాముండేశ్వరీ ఆలయంలో చిత్రీకరించారు. రజనీ స్నేహితుడు, కర్ణాటక గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్ క్లాప్నిచ్చారు. పూజా కార్యక్రమాల్లో నిర్మాత రాక్లైన్ వెంకటేష్తోపాటు దర్శకుడు కె.ఎస్.రవికుమార్, అంబరీష్ భార్య సుమలత పాల్గొన్నారు.
మే 3 నుంచి మైసూరు, మాండ్య జిల్లాల్లో తొమ్మిది రోజులపాటు చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నిర్మాత రాక్లైన్ వెంకటేష్ మాట్లాడుతూ ''రజనీతో సినిమా చేయడం ఎంతో గర్వంగా ఉంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలో చిత్రీకరణ చేస్తాము''అని తెలిపారు. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











