'రక్త చరిత్ర' రిలీజు ఎక్కడనేది కూడా తెలియకుండా..
సాధారణంగా ఏ చిత్రమైనా విడుదలకు వారం, పదిరోజుల ముందే పోస్టర్లు అతికించి, ఫ్లెక్సీలువేసే థియేటర్ల యజమాన్యం రక్త చరిత్ర సినిమా విషయంలో మాత్రం జాగ్రత్త పడుతోంది. అయితే ఈ పరిస్ధితి అనంతపురంలో మాత్రమే. ఈ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ లవద్ద ఎటువంటి ప్రచార ఆర్భాటం కనిపించడంలేదు. రక్త చరిత్ర సినిమా అనంతపురంలో ఏ థియేటర్లో వేస్తారో కూడా తెలియకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఎక్కడా కూడా ఎటువంటి పోస్టర్లు అంటించక పోవడం గమనార్హం. ఇది సున్నితమైన అంశం కావడంతో సినిమా థియేటర్ యజమాన్యాల్లోనూ కలకలం రేపుతోంది. అయితే పోలీసు యంత్రాంగం మాత్రం ఈ సినిమా విడుదలపై ఇప్పటికే బాంబు, డాగ్ స్క్వాడ్, లైవ్ డిటెక్టర్లు, పటిష్టమైన పోలీసు బందోబస్తు, నిఘాను ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ చిత్రంపై ఇప్పటికే అనేక ఊహాగానాలు రేగుతున్న విషయం తెలిసిందే. పరిటాల రవీంద్ర, మద్దెలచెరువు సూరి కుటుంబాల మధ్య జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాల కథాంశంగా దీన్ని తెరకెక్కించడంతో, ఆ ఘటనలను చిత్రంలో ఎలా చూపించారోనని ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఎవరిది పైచేయిగా చూపించారో తెలుసు కోవాలనే ఉత్కంఠ సహజంగానే సర్వత్రా కనిపిస్తోంది. సినిమా ప్రారంభ వేడుకలను చూసిన తరువాత ఆ సినిమాలో వున్న సన్నివేశాన్ని బట్టి ఆయా వర్గాలు స్పందిస్తామని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి. అదే విధంగా ఓబుళ్ రెడ్డిని విలన్ గా చిత్రీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అతని సోదరి ఉమాదేవి, మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి అభిమానులు, బంధువులు హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











