తల్లి కోసం రామ్ చరణ్ అమరనాథ్ యాత్ర (ఫోటోస్)
హైదరాబాద్: హియాలయాల్లో వెలసిన పరమశివుడు(మంచు లింగం)ని దర్శించుకునేందుకు అమరనాథ్ యాత్ర సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడిస్తూ... ‘అమరనాథ్ యాత్రకు వెళ్లాలనేది అమ్మ కోరిక. ఇప్పటికి తీర్చగలిగాను. యాత్ర విజయవంతంగా పూర్తయింది. సముద్రమట్టానికి 13వేల అడుగుల ఎత్తులో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.
అమరనాథ్ యాత్ర నాగపంచమి రోజున మొదలై, శ్రావణ పౌర్ణమి రోజున గుహవద్ద ముగుస్తుంది. శివ భగవానుడు మంచు శివలింగం రూపంలో దర్శనమిచ్చే ఈ అమర్నాథ్ క్షేత్రం... హిమాలయా పర్వతశ్రేణిలోని జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్కు 125 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి సుమారు 13 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. 60 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతు, 15 అడుగుల ఎత్తు ఉన్న ఈ అందమైన, మనోహరమైన గుహ సహజసిద్ధమైనది.

స్థల పురాణం...
పరమశివుడు అమరుడు ఎలా అయ్యాడన్న తన సందేహాన్ని తీర్చమని పార్వతీదేవి శివుడిని కోరుతుంది. తాను ఈ రహస్యం చెప్పాలంటే, మనం ఇద్దరు తప్ప వేరే ఏ జీవి ఇక్కడ ఉండకూడదని.. అలా ఎవరయినా విన్నట్లయితే, వారు కూడా అమరులవుతారని, అది సృష్టి విరుద్ధమని.. పార్వతిదేవితో అంటాడు శివుడు.
ఎంత చెప్పినా పార్వతీదేవి ఆ రహస్యాన్ని చెప్పమని పట్టుబట్టడంతో.. శివుడు ఆమెను ఎలాంటి జీవీ నివసించని హిమాలయా పర్వతాల మధ్యనుండే ఒక గుహను అనుకూలమైనదిగా భావిస్తాడు. ఆ తరువాత పహల్గామ్లో నందిని, చందన్వాడలో చంద్రుడిని, మహాగునస్ వద్ద వినాయకుడిని, పంచతరుణి వద్ద పంచభూతాలను వదలి గుహ వద్దకు చేరుకుంటాడు శివుడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత శివుడు పార్వతీదేవికి అమరత్వ కథను చెప్పటం ప్రారంభిస్తాడు. అయితే కథను వింటున్న పార్వతీదేవి మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. అది గమనించని శివుడు కథ మొత్తాన్ని చెబుతాడు.
హిమాలయాలు పరమశివుడి నివాసమని, ఆయన ఈ మంచుకొండల్లోనే సంచరిస్తుంటాడని హిందువుల నమ్మకం. అందుకే అమరనాథ్ గుహలో వెలసిన పరమశివుడు అమరనాథుడిగా పూజలందుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











