పవన్ ఇప్పుడు రాలేదు కానీ... ( 'గోవిందుడు...' ఆడియో ఫొటోలు)
హైదరాబాద్ : ''తమ్ముడు పవన్ కల్యాణ్ ఇప్పుడు రాలేదు గానీ... ఈ సినిమా 150వ పండుగ దినోత్సవానికి వస్తాడు. అప్పటి వరకూ ఓపిక పట్టండి.' అన్నారు చిరంజీవి. పాటల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన గోవిందుడు అందరివాడేలే చిత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు.
రామ్చరణ్, కాజల్ జంటగా నటించిన చిత్రమిది. కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్ నిర్మాత. యువన్శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు సోమవారం హైదరాబాద్లో విడుదలయ్యాయి.
అలాగే... సినీ పరిశ్రమకు దూరమై రాజకీయాల్లోకి వచ్చినందుకు ఏనాడూ బాధ పడలేదు. దానికి కారణం రామ్చరణ్. తనలో నన్ను నేను చూసుకొంటున్నా. అందుకే సినిమాలకు దూరమైన లోటు కనిపించలేదు'' అన్నారు చిరంజీవి.
స్లైడ్ షోలో ఆడియో విడుదల విశేషాలు..

ఆవిష్కరణ...
తొలి సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. కె.రాఘవేంద్రరరావు అందుకొన్నారు.

ప్రచార చిత్రాన్ని ...
చిత్రం టీజర్ ని సురేఖ, ఉపాసన విడుదల చేశారు. ఈ టీజర్ ఇప్పటికే విడుదలై అన్ని వర్గాల ఆదరణ పొందుతోంది.

చిరంజీవి మాట్లాడుతూ....
''కృష్ణవంశీ అంటే నాకు ప్రత్యేక అభిమానం. కమర్షియల్ సినిమాలు తీసి హిట్ కొట్టి ఎదగాలని చూడడు. తరిగిపోతున్న కుటుంబ విలువలు, మానవ సంబంధాలు తెరపై చూపించాలనుకొంటాడు. అయితే నేనెప్పుడూ కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలని అనుకోలేదు. ఎందుకంటే అది కత్తిమీద సాములాంటిది. ప్రతీ నటుడికీ ఓ పరీక్ష. ఇన్ని సినిమాలు చేశాక.. ఇలాంటి పరీక్ష ఎదుర్కోవడం అవసరమా అనిపించింది.

కృష్ణ వంశీ గురించి చిరంజీవి
'గోవిందుడు..' టీజర్ చూశాక, ఆ రోజు కృష్ణవంశీ మాటలు విన్న తరవాత.. చాలా మారాడనిపించింది. ప్రతీ మాటలోనూ నిజాయతీ కనిపించింది. తన కెరీర్ మధ్యలో కొన్ని అవాంతరాలొచ్చాయి. అయితే ఓ మంచి కథ రాసుకొని, అది చరణ్కైతే బాగుంటుందని మా దగ్గరకు తీసుకొచ్చాడు. నాకు 'విజేత' ఎలానో.. చరణ్కి ఈ సినిమా అలాంటిది. తరిగిపోతున్న బంధాల్ని బలోపేతం చేయడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఈ సినిమాతో కృష్ణవంశీ కష్టం ఫలిస్తుంది.

గణేష్ గురించి చిరంజీవి..
గణేష్ మామూలు స్థాయి నుంచి వచ్చాడు. ఇప్పుడు పెద్ద నిర్మాత అయ్యాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాలనుకొన్నప్పుడు.. ధైర్యంగా ముందుకెళ్లాడు.

సంగీత దర్శకుడు గురించి...చిరు
నా సినిమాలకు ఎన్నో మధురమైన బాణీలిచ్చారు ఇళయరాజా. ఆయన కుమారుడు యువన్శంకర్ రాజా రామ్చరణ్ సినిమాకి పనిచేయడం ఆనందంగా ఉంది. పాటలు విన్నా. చాలా బాగున్నాయి. ప్రకాష్రాజ్, జయసుధ ఈ చిత్రానికి నిండుదనం తీసుకొచ్చారు. పరుచూరి సోదరుల అనుభవం ఈ సినిమాకి పనికొచ్చింది.

150 వ చిత్రం గురించి చిరు
నా సినిమా ఈ యేడాది చివర్లో ప్రారంభం అవుతుంది. ఆ సినిమా ఎప్పుడో నిర్ణయించాల్సింది మీరో నేనో కాదు.. మంచి కథే. దాని కోసం ఎదురుచూద్దాం..'' అన్నారు.

రాఘవేంద్రరావు మాట్లాడుతూ..
''ఈ చిత్రసీమలో రామ్చరణ్.. జగదేక వీరుడిగా వెలగాల''ని రాఘవేంద్రరావు ఆకాంక్షించారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ...
''మన ఇల్లు మనమే చక్కబెట్టుకోవాలి, మన పని మనమే చేసుకోవాలి.. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి. అనే సంభాషణతో ఈ సినిమా మొదలవుతుంది. ఈ ఒక్క డైలాగ్ వంద ఫైట్లూ, వంద పాటలతో సమానం. ఇలాంటి సినిమా చేసినందుకు మనస్ఫూర్తిగా చేతులెత్తి వంశీగారిని నమస్కరిస్తున్నా'' అని చరణ్ చెప్పారు.

కాజల్ మాట్లాడుతూ...
''చరణ్తో ఇది నా నాలుగో సినిమా. సినిమా సినిమాకీ అతను ఎదుగుతున్నాడు. కృష్ణవంశీగారి 'చందమామ' ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది'' అంది.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ..
''చరణ్తో సినిమా చేయాలని మూడేళ్ల నుంచీ ఎదురుచూస్తున్నా. మధ్యలో ఓ సినిమా మొదలెట్టాం. అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈలోగా ఎంతమంది నిర్మాతలొచ్చినా 'గణేష్కి సినిమా చేసిన తరవాతే.. మీ సినిమా మొదలెడతా' అన్నారాయన . ప్రతీ రోజూ బడ్జెట్ గురించి అడిగేవారు. ఓ నిర్మాతలా ఆలోచించేవారు. చిరంజీవి గారి కుటుంబ కథలాంటిదే.. 'గోవిందుడు అందరివాడేలే'' అని బండ్ల గణేష్ చెప్పారు.

యవన్ శంకర్ రాజా మాట్లాడుతూ...
''నాన్నగారు చిరంజీవితో పనిచేశారు. ఇప్పుడు నేను చరణ్తో పనిచేడం ఆనందంగా ఉంది. నేను కాదు.. నా పాటలే మాట్లాడాలి'' అని యువన్ శంకర్ అన్నారు.

ఎవరెవరు
కార్యక్రమంలో కమలినీ, పరుచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, శరత్ మరార్, కె.ఎస్.రామారావు, నాగబాబు, డి.వి.వి.దానయ్య, డా||వెంకటేశ్వరరావు, సాయిధరమ్తేజ్, వరుణ్తేజ్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











