సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెట్టాలని వర్మ పిటీషన్, పరిశ్రమ పెద్దల మద్దతు!
హైదరాబాద్: రిజనల్ సెన్సార్ బోర్డు ఆఫీసర్ ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు నాంపల్లి పిటీషన్ దాఖలు చేసారు. కొన్ని సినిమాల విషయంలో ఆమె పక్షపాతం వహిస్తున్నారని వర్మ ఆరోపించారు.
పిటీషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన పలు టీవీ ఛానళ్లలో ఈ విషయమై లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఇండస్ట్రీ పెద్దలు మద్దతు ప్రకటించారు. వర్మకు మద్దతుగా నిలిచిన వారిలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, మోహన్ బాబు కాడా ఉన్నారు. ఇప్పటి వరకు సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి గురించి ఎవరికీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు నిర్మాతలు వాపోయారు.
స్లైడ్ షోలో....వర్మ దాఖలు చేసిన పిటీషన్ కాపీలతో పాటు, మరిన్న వివరాలు

వర్మ పిటీషన్-1
'అరుంధతి' సినిమాలో వీపులో నుంచి కత్తితో పొడిచి రక్తం కారుతుండగా రేప్ చేసినట్లు చూపిస్తారని, కానీ, తమ సినిమాలో చెంప మీద కొడితేనే మహిళలు బాధ పడతారంటూ ధనలక్ష్మి ఆ సీన్ కట్ చేశారని వర్మ విమర్శించారు. డాన్స్ చేస్తున్న సీన్లను కూడా కట్ చేశారని ధ్వజమెత్తారు. తన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడడమే ధనలక్ష్మి ధ్యేయంలా ఉందని వర్మ మండిపడ్డారు. నోర్మూసుకో అనడం.. అధికారం దుర్వినియోగం చేయడాన్ని ప్రశ్నించడానికే కేసు పెడుతున్నానని తెలిపారు.

వర్మ పిటీషన్-2
సెన్సార్ అధికారి ధనలక్ష్మి నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు. 'సత్య' సినిమాకు సీక్వెల్గా తాను తీసిన 'సత్య2'కు ఏకంగా 34 కట్స్ వేశారని, సినిమా విడుదలకు ఇబ్బందులు సృష్టించారని, యూనిట్ను అభ్యంతరకరంగా దూషించారని మండిపడ్డారు. ఇదే అంశంపై రామ్ గోపాల్ వర్మతో 'ఆంధ్రజ్యోతి ఏబీఎన్' మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆదివారం బిగ్ డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. కొంతమంది అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి కొన్ని పనులు చేస్తుంటారని ధనలక్ష్మిపై మండిపడ్డారు.

వర్మ పిటీషన్-3
"హిందీలో అచ్చు ఇదే సినిమా. అక్కడ నామమాత్రంగా రెండో మూడో కట్స్ ఇచ్చారు. అదే సినిమాకు ధనలక్ష్మి 30-40 కట్స్ ఇచ్చారు. నా అసిస్టెంట్లు మాట్లాడుతుంటే ఆమె 'జస్ట్ షటప్' అన్నారు. అధికారంలో ఉన్నామని అలా మాట్లాడడం తప్పు. ఇష్టం వచ్చినట్లు కట్ చేస్తే సినిమా తీసినప్పుడు ఉన్న ఫీలింగ్ పోతుంది. నిర్మాతకి ఆర్థికంగా ఇబ్బందులుంటాయి. దర్శకుడిగా పునరాలోచించాలని వెళ్లవచ్చు. కానీ, అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు కదా!?'' అని వర్మ ప్రశ్నించారు.

వర్మ పిటీషన్-4
సినిమా పరిశ్రమలోని మిగిలిన వాళ్లు మాట్లాడడానికి భయపడతారని, అందుకే తాను ముందుకు వచ్చానని చెప్పారు. కేసు వేయాలని నిర్ణయించుకున్నానని వర్మ తెలిపారు. తన అహం దెబ్బతిందని, కేవలం అధికారం కారణంగా ఓ కుర్చీలో కూర్చున్నందుకు తన కాళ్లకు దణ్ణం పెట్టాలని ఆమె భావిస్తూ ఉండవచ్చని చెప్పారు. సెన్సార్ చేయని ట్రైలర్ను మీడియాకు విడుదల చేస్తే.. దానిని వాళ్లు ప్రసారం చేస్తే అది సదరు చానల్కు సంబంధించిన విషయమని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే సెన్సార్ లేకుండానే సినిమాను విడుదల చేయాలని అంటానని చెప్పారు. సెన్సార్ అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని ధ్వజమెత్తారు. దొరికారు కదాని క్లాసులు పీకడం సరికాదని మండిపడ్డారు. 'పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం' అనే వాణిజ్య ప్రకటనను చూసి సిగరెట్ తాగడాన్ని మానేసేవాళ్లు లోకంలో ఎవరైనా ఉంటారా!? అని ప్రశ్నించారు. అంటే, ఆడియన్స్ వెధవలా అని నిలదీశారు. సినిమా పరిశ్రమ నిస్సహాయ స్థితిలో ఉందన్న విషయం ధనలక్ష్మికి కూడా తెలుసునని, అందుకే ఆమె మాట్లాడుతున్నారని చెప్పారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎవరు ఫిర్యాదు చేశారన్న విషయం ధనలక్ష్మికి తెలిసిపోతుందని, ఆ తర్వాత ఆమె తమను ఏమైనా చేస్తుందేమోనని మిగిలిన వారు భయపడుతున్నారని వర్మ చెప్పారు. ఆమె వ్యవహార శైలితో తాను విసిగిపోయానని అన్నారు.


Click it and Unblock the Notifications











