బాలకృష్ణతో సినిమా అనగానే భయపెట్టారు
హైదరాబాద్ : ''బాలకృష్ణగారితో సినిమా అనగానే చాలామంది భయపెట్టారు. భయపడి ఆయనతో నేను సినిమా చేయకపోతే... ఓ అద్భుతమైన వ్యక్తిని కోల్పోయేవాడ్ని'' అంటున్నారు నిర్మాత రమేష్ పుప్పాల. బాలకృష్ణ హీరోగా, రవి చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన 'శ్రీమన్నారాయణ' ఈ నెల చివరివారంలో విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్లో ఆయన మీడియాతో ముచ్చటిస్తూ పై విధంగా స్పందించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా జర్నలిస్టు గా చేస్తున్నారు. ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ బేనర్పై రమేశ్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవికుమార్ చావలి దర్శకుడు.
అలాగే ..''క్రమశిక్షణకు మారుపేరు బాలయ్య. భేషజానికి ఆయన ఆమడ దూరం. అంతటి స్టార్ హీరో అయ్యుండి కూడా ఏనాడూ ప్రత్యేకత కోసం ఆయన పాకులాడలేదు. అందరితో స్నేహితుడిలా కలిసిపోయేవారు. షాట్లోకి వెళితేమాత్రం ఒక్కసారిగా హీరో అయిపోయేవారు. దటీజ్ బాలయ్య. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తవ్వడానికి కారణం ఆయనే'' అని చెప్పారు.
ఇక చిత్రంలోని బాలకృష్ణ పాత్ర గురించి చెబుతూ- ''సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టే సమయస్ఫూర్తి గల జర్నలిస్ట్గా ఇందులో బాలయ్య నటించారు. జర్నలిస్ట్ అనేవాడు నిస్వార్థంగా ఉంటే అతనికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇందులో చూపించాం. సామాన్యుడు శక్తిగా మారితే ఎలా ఉంటుందో బాలకృష్ణగారి పాత్ర చెబుతుంది. ఇందులో బాలయ్య పలికిన డైలాగులు డైనమేటుల్లా పేలతాయి. అభిమానులకు ఈ సినిమా ఓ పండగ. ఇందులో ఆరుగురు విలన్లు ఉంటారు. సురేష్ మెయిన్ విలన్గా నటించారు. వినోద్కుమార్ ప్రత్యేకపాత్ర చేశారు. బాలకృష్ణ తండ్రిగా విజయ్కుమార్ నటించారు అన్నారు.
అంతేకాదు హీరోయిన్లు పార్వతిమెల్టన్, ఇషాచావ్లా ఇద్దరివీ కథలో కీలకమైన పాత్రలే. బాలకృష్ణ మరదలుగా ఇషాచావ్లా నటించగా... గొప్పింటమ్మాయి పాత్రను పార్వతీమెల్టన్ పోషించారు. ఇందులో అన్ని పాత్రలూ వినోదాన్ని పంచే విధంగా ఉంటాయి చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు రవిచావవి గురించి చెపుతూ...''రవి చావలి ప్రతిభావంతుడైన దర్శకుడు. నాకు చాలాకాలంగా మిత్రుడు కూడా. సున్నితమైన భావాలు కలిగిన వ్యక్తిగా కనిపించినా... ఎమోషనల్గా ఈ సినిమాను మలిచాడు. చెప్పిన బడ్జెట్ను తను అస్సలు దాటనీయడు. ఇంకా క్వాలిటీకోసం నేనే బడ్జెట్ పెంచాను అన్నారు.
"దర్శకుడు రవి ప్రతిభను పూర్తిస్థాయిలో బయటకు తెచ్చే సినిమా ఇది. 'సామాన్యుడు' చిత్రానికి వందరెట్లు గొప్పగా ఉంటుందీ సినిమా'' అని రమేష్ అన్నారు. చక్రి శ్రావ్యమైన సంగీతం అందించాడని, పాటలు సంచలనం సృష్టిస్తున్నాయని, వచ్చేవారం డిస్క్ ఫంక్షన్ నిర్వహించనున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.


Click it and Unblock the Notifications











