మా ముఖాల మీద ఊసినవ్.. తాట తీయనికే వస్తున్నా.. టైగర్ కేసీఆర్తో చిచ్చు రేపిన ఆర్జీవీ!
Recommended Video
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలనాలు ఆగేలా లేవు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఆర్జీవీ ఆ చిత్రం తెలుగు రాష్ట్రల్లో పూర్తిగా విడుదల కాకముందే మరో వివాదానికి తెరతీశారు. ఇటీవల వర్మ కేసీఆర్ బయోపిక్ చిత్రాన్ని తీయబోతున్నట్లు ప్రకటిస్తూ టైగర్ కేసీఆర్ అనే టైటిల్ పోస్టర్ ని కూడా విడుదల చేశాడు. దీనితో కేసీఆర్ బయోపిక్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆర్జీవీ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ బయోపిక్ గురించి వరుస ట్వీట్స్ చేస్తున్నాడు. ఆంధ్రులని ఉద్దేశించి ఆర్జీవీ పాడిన ఓ పాట ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారేలా ఉంది.

గాంధీతో పోల్చుతూ
రాంగోపాల్ వర్మ కేసీఆర్ ని గాంధీతో పోల్చుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ బ్రిటిష్ వారితో శాంతియుతంగా పోరాడి స్వాతంత్రం సాధించారు. కేసీఆర్ దూకుడు స్వభావం ఉన్న గాంధీలా ఆంధ్రులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సాధించారని ఆర్జీవీ ప్రశంసించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టైగర్ కేసీఆర్ ఫస్ట్ లుక్ రోలీజ్ చేయబోతున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు.
ఆంధ్రులని తిడుతూ పాట
తాను తెరకెక్కించబోయే కేసీఆర్ బయోపిక్ చిత్రం టైగర్ కేసీఆర్ లోని ఓ పాట లిరిక్స్ ని వర్మ పాడి వినిపించాడు. వర్మ ఉపయోగించిన పదాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. 'మా భాష మీద నవ్వినవ్.. మా ముఖాల మీద ఊసినవ్.. మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా.. వస్తున్నా.. వస్తున్నా.. నీ తాట తీయనీకే వస్తున్నా.. టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్ అంటూ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఆంధ్రులని కించపరిచేలా వర్మ పాట ఉందంటూ పలువురు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రోళ్లు విలన్లు కాదు
తాను తెరక్కించబోయే టైగర్ కేసీఆర్ చిత్రంలో ఆంధ్రోళ్ళని విలన్లుగా చూపించడం లేదని వర్మ క్లారిటీ ఇచ్చాడు. తెలంగాణ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ఆంధ్ర, తెలంగాణ మధ్య వర్మ చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నాడని ఓ నెటిజన్ చేసిన కామెంట్ పై వర్మ స్పందించారు. నా చిత్రంలో ఆంధ్ర ప్రజలు విలన్లు కాదు. కొంతమంది ఆంధ్రోళ్లు కోట్లాదిమంది ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని మాత్రం చూపిస్తానని వర్మ తెలిపాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ
కేసీఆర్ బయోపిక్ చిత్రం అంటే ఆంధ్ర నాయకుల ప్రస్తావన తప్పనిసరిగా ఉంటుంది. దీనితో ఎవరెవరిని విలన్లుగా చూపించబోతున్నాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వర్మ చంద్రబాబుని, ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోర్టు చిక్కుల్లో పడి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాలేదు. ఇంతలోపే ఆర్జీవీ కేసీఆర్ బయోపిక్ ని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











