Mahesh Babu ఇంట్లో చోరీకి యత్నం: సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్గా వెలుగొందుతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అతడి తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. దీంతో ఆ ఫ్యామిలీతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ పరిణామంతో విషాదంలో ఉన్న సినీ పరిశ్రమలో ఇప్పుడు ఓ న్యూస్ హాట్ టాపిక్గా మారిపోయింది. మహేశ్ బాబు ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడి గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? అతడికి గాయాలు ఎందుకు అయ్యాయి? అనేది చూద్దాం పదండి!

తల్లి మృతి.. విషాదంలో మహేశ్
సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితమే హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పతికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు ఆమెకు చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే నిన్న తన ఇంట్లో ఇందిర తుదిశ్వాస విడిచారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న మహేష్
తల్లి ఇందిరా దేవి మరణంతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. బుధవారం ఉదయాన్నే తన తల్లి భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన ఈ స్టార్ హీరో.. అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. మహా ప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని.. తన తల్లి చితికి నిప్పు అంటించాడు. ఇక, మహేశ్ను అలా చూసిన అభిమానులు తట్టుకోలేకపోయారు.

మహేశ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి
ఒకవైపు మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్తతో అటు సినీ పరిశ్రమతో పాటు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే విషాద ఛాయలు కనిపించాయి. దీంతో బుధవారం మొత్తం ఇదే అంశం బాగా హైలైట్ అయింది. ఇది జరిగి ఒకరోజు కూడా కాకముందే ఈ స్టార్ హీరో గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. ఓ వ్యక్తి మహేశ్ బాబు ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించాడని తెలిసింది.

గోడ దూకడంతో తీవ్ర గాయాలు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 81లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఓ విలాసవంతమైన భవనం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇంట్లో చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఇందుకోసం అతడు దాదాపు పదిహేను అడుగుల ఎత్తు ఉన్న గోడను ఎక్కి లోపలికి దూకాడు. దీంతో అతడి కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిసింది.

ఆస్పత్రిలో చికిత్స.. ఆలస్యంగా
గోడ దూకిన వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి పెద్ద సౌండ్ వచ్చిందట. దీంతో వాళ్లు వెంటనే అక్కడకు వెళ్లి చూడగా.. సదరు వ్యక్తి తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతూ కనిపించాడు. దీంతో వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆ వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇది మంగళవారం రాత్రి జరిగింది. కానీ, ఈ విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దీనిపై పోలీసులు ఏం చెప్పారు?
మహేశ్ ఇంట్లో జరిగిన ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి ఒరిస్సాకు చెందిన కృష్ణ (30) అని తెలిసింది. అతడు మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి.. మహేశ్ ఇంటి సమీపంలోని ఓ నర్సరీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. అతడు కోలుకున్నాక పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు.

షూటింగ్కు గ్యాప్ ఇవ్వనున్నాడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ను అతడు ఇటీవలే పూర్తి చేసుకున్నాడు. ఇక, ఇప్పుడు మహేశ్ తల్లి ఇందిరా దేవి మరణంతో షూటింగ్కు కాస్త విరామం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో రెండో షెడ్యూల్ కొంత ఆలస్యం కానుందని టాక్.


Click it and Unblock the Notifications











