సంజయ్ దత్ పెరోల్ : విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
పూణె: ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రస్తుతం ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన భార్య మాన్యత అనారోగ్యంగా ఉందనే కారణంలో సంజయ్ దత్ నెల రోజులు పెరోల్పై విడుదల చేయాలంటూ విన్నవించారు. కోర్టు ఆయనకు పెరోల్ మంజూరు చేసింది.
అయితే సంజయ్ దత్కు పెరోల్ మంజూరు చేయడంపై పలు ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సినిమా యాక్టర్ అయినంత మాత్రాన అతన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, ఇతర ఖైదీలతో సమానంగా చూడాలని, పెరోల్పై విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు జైలు వద్ద నిరసన చేపట్టారు.
దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సంజయ్ దత్ పెరోల్ విషయంలో విచారణ జరుపాలంటూ మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సంజయ్ దత్ ఇప్పటికే రెండు సార్లు అనారోగ్యం కారణంగా పెరోల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.


Click it and Unblock the Notifications












