వంద రోజుల పండుగరోజు తొడగొడతా
హైదరాబాద్ : ఈ సినిమా తప్పక హిట్టవుతుందని ఇప్పుడే తొడగొట్టాలనిపిస్తోంది. కానీ 100 రోజుల వేదికపై కొట్టి చెప్తా అని శ్రీహరి అన్నారు. శ్రీహరి యముడిగా నటిస్తున్న 'యమహోయమః' చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో ఇలా స్పందించారు. సాయిరామ్శంకర్, పార్వతీమెల్టన్ జంటగా నటించిన చిత్రం 'యమహో యమః'. ఈ చిత్రానికి జితేంద్ర దర్శకుడు. జి.విజయకుమార్ నిర్మాత. మహతి స్వరాలను సమకూర్చిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. బెల్లంకొండ సురేష్ ఆడియో సీడీని ఆవిష్కరించి సాగర్కి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు అభిలషించారు.
అతిధిగా వచ్చన బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ''శ్రీహరి వల్లే నేను నిర్మాతను అయ్యాను. నిర్మాతల శ్రేయస్సును కోరుకొనే హీరో ఆయన. శ్రీహరితో సినిమాలు చేసిన ఏ నిర్మాత చెడలేదు. సినిమా హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నానుఇలాంటి వేడుకలకు హీరోయిన్స్ తప్పకుండా రావాలి. రాలేదంటే నిజంగా వారి దురదృష్టమే'' అన్నారు.
సాయిరామ్శంకర్ మాట్లాడుతూ ''. ఇంతమంచి కథకు హీరోగా నన్ను ఎంచుకున్న దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. యుముడిపై గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఇది వాటికి భిన్నంగా యమ భక్తుడి నేపథ్యంలో సాగుతుంది. యుముడిగా శ్రీహరి నటించడం చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. శ్రీహరిగారు యాక్టింగ్ ఇరగదీశారు. నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. మహతి మంచి బాణీలు సమకూర్చారు'' అన్నారు.
ఈ చిత్రం కథ ప్రకారం...పాపుల చిట్టా చూడాల్సిన యమధర్మరాజు అమెరికా వీధుల్లో ప్రత్యక్షమవుతాడు. అక్కడి వరకూ బాగానే ఉంది... ఎవరితో మాట్లాడదామన్నా భాషాపరమైన సమస్య. యముడికి ఆంగ్లంతో వచ్చిన చిక్కులు ఎలాంటివి? విషయం తెలుసుకున్న ఆయన భక్తుడు ఎలా స్పందించాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. వరాలిచ్చే దేవుళ్లను అందరూ పూజిస్తారు. ఆయువు తీరగానే తీసుకెళ్లిపోయే యముడి పేరు చెబితేనే కంగారుపడతారు. కానీ ఓ యువకుడు మాత్రం యమ నామ జపం చేశాడు. ఎందుకు? ఏం సాధించాడు? అన్నది తెర మీదే చూడమంటున్నారు.
ఆ చిత్రంలో సాయిరామ్ క్యారెక్టర్ గురించి దర్శకుడు జితేందర్.వై మాట్లాడుతూ... పొద్దున లేవగానే రామా.. కృష్ణా... అని తలచుకొనే భక్తుల్ని చూశాం. శివుడికీ, శ్రీ వెంకటేశ్వరస్వామికీ దండం పెట్టుకొనేవాళ్లనీ చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం నిత్యం యమనామ జపం చేస్తుంటాడు. యమధర్మరాజుకి అపరభక్తుడిగా మారిన ఆ యువకుడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. అలాగే... ఒక యమభక్తుడు సృష్టించే సందడితో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. యమధర్మరాజు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాన్ని తెరపైనే చూడాలి. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో కథ సాగుతుంది. యమధర్మరాజుగా శ్రీహరి నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి రచన: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: మహతి, ఆర్ట్: వి.ఎన్.మణి, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: అమీషా ఎంటర్టైన్మెంట్స్.


Click it and Unblock the Notifications











