విడుదల విషయం సమంతకు తెలియజేయని నిర్మాతలు
హైదరాబాద్: నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న'ఆటో నగర్ సూర్య' ఈ నెల 27న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్మాతల నుండి మీడియాకు సమాచారం కూడా అందింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన సమంతకు మాత్రం నిర్మాతలు ఈ విషయం తెలియజేయలేదు. ఆమె అందాల ప్రదర్శనతో కూడిన ఫోటోలతో సినిమా పబ్లిసిటీ చేస్తున్న నిర్మాతలు ఆమెకు ఈ విషయం చెప్పక పోవడం ఏమిటి? అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గతంలో కూడా అనేక సార్లు 'ఆటో నగర్ సూర్య' సినిమా విడుదల అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అనేక సార్లు సినిమా వాయిదా పడింది. దీంతో ఈసారైన సినిమా నిజంగానే విడుదలవుతుందా? లేదా? అని అయోమయంలో పడింది సమంత. 27న సినిమా నిజంగానే విడుదలవుతుందా? లేదా? ఎవరైనా క్లారిటీ ఇవ్వండి అంటూ ట్వీట్ చేసింది.

చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేద్దామని పలు సందర్భాల్లో నిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ వివిధ రకాల ఇబ్బందులు, కోర్టు సమస్యలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు జోక్యం చేసుకుని సినిమా విడుదలయ్యేందుకు తగిన సాయం చేసారని, రెండు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దేవాకట్ట దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్నినిర్మించారు.


Click it and Unblock the Notifications











