షాకింగ్: జైల్లో సంజయ్ దత్కు మందు, విందు!
ముంబై: పూణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్పై షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైల్లో ఆయనకు బీర్, రమ్ లాంటి మద్యం పానీయాలను జైలు సిబ్బంది సరఫరా చేస్తున్నారని బీజేపీ నేత వినోద్ తావ్డే మహారాష్ట్ర కౌన్సిల్లో ఫిర్యాదు చేసారు. ఒక నేరస్తుడికి మందు విందు ఏర్పాటు చేయడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఇప్పటికే జైల్లో ఉన్న సంజయ్ దత్పై అనేక వివాదాలు ఉన్నాయి. సంజయ్ దత్కు పెరోల్ మంజూరు చేయడంపై పలు ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సినిమా యాక్టర్ అయినంత మాత్రాన అతన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, ఇతర ఖైదీలతో సమానంగా చూడాలని, పెరోల్పై విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు జైలు వద్ద ఇటీవల నిరసన చేపట్టారు.
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.
రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.


Click it and Unblock the Notifications












