పవన్ కళ్యాణ్ సినిమాకు అంత రేటు ఇవ్వమంటున్నారు!
హైదరాబాద్: దశాబ్ద కాలం క్రితంతో పోలిస్తే తెలుగు సినిమా వసూళ్ల వాటా ఓవర్సీస్ మార్కెట్లో బాగా పెరిగింది. స్టార్ హీరోల సినిమాలు ఇక్కడ మిలియన్ డాలర్ వసూళ్లు ఈజీగా వసూలు చేస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో మహేష్ బాబు నటించిన సినిమాలే ఎక్కువ. అందుకే మహేష్ బాబు సినిమాలను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ భారీ ధరకు కొనుగోలు చేస్తుంటారు.
మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం' సినిమా వచ్చే వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు ఇప్పటి నుండి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో వైపు పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ‘బ్రహ్మోత్సవం' విడుదలైన నెల గ్యాపులో విడుదల కాబోతోంది.
పవన్ కళ్యాణ్ సినిమాను దక్కించుకునేందుకు కూడా పలువురు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిర్మాతల మాత్రం ఇప్పుడే డీల్ కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం' చిత్రానికి ఎంత రేటు వస్తే అంతకు తక్కువ కాకుండా బిజిజెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

‘బ్రహ్మోత్సవం' సినిమాకు వచ్చినంత రేటు రాబట్టు కోవాలనే ప్లాన్లో‘సర్దార్ గబ్బర్ సింగ్' నిర్మాతలు ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తాము వపన్ కళ్యాణ్ సినిమాకు అంత ఇచ్చుకోలేమని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' భారీ వసూళ్లు సాధించడం వెనక పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో పాటు, త్రివిక్రమ్ మ్యాజిక్ కూడా ఉందని, సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ తప్ప మరో ఆసక్తికర అంశం ఏమీ లేదని అంటున్నారు.
మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' భారీ హిట్టయింది. అందుకే ఈ కాంబినేషన్లో వస్తున్న ‘బ్రహ్మోత్సవం'పై జనాల్లో బాగా క్రేజ్ ఉంది. ఈ సినిమాకు ఇచ్చినంత రేటు ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఇవ్వమంటే ఎలా? అని అంటున్నారు.
ఓవర్సీస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బ్రహ్మోత్సవం సినిమాకు నిర్మాతలు రూ. 13 కోట్ల రేటు చెబుతున్నారని టాక్. మహేష్ బాబు ‘శ్రీమంతుడు' ఫుల్ రన్ లో 13 కోట్ల షేర్ వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











