ఆయన మాట వినకుండా రూ. 100 కోట్లు పోగొట్టుకున్నా.. కబ్జా చేశారంటూ కన్నీళ్లతో చంద్రమోహన్
సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా, నటుడిగా, కమెడియన్ గా అనేక సినిమాల్లో ఆయన తనదైన శైలీలో అలరించారు. 1966 సంవత్సరంలో రంగులరాట్నం సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇటీవల విడుదలైన శ్రీకాంత్ కోతల రాయుడు సినిమాలో చివరిసారిగా నటించారు. ప్రస్తుతం గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రమోహన్, ఆయన సతీమణి జలంధర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కామెడీ సినిమాలతో..
చంద్రమోహన్ గా తెలుగు చిత్రసీమలో పాపులారిటీ దక్కించుకున్న ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తెలుగు సినిమా రంగంలో అనేకమైన విలక్షణమైన పాత్రలు పోషించి విపరీతమైన గుర్తింపు పొందారు. 1966 సంవత్సరంలో విడుదలైన రంగురాట్నం చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించిన చంద్రమోహన్ అప్పటి నుంచి సహాయనటుడిగా, కథానాయకుడిగా, కమెడియన్ గా వివిధ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా కామెడీ సినిమాలతో ఆయన బాగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా కొత్తగా వచ్చే హీరోయిన్లకు ఆయన లక్కీ హీరోగా పేర్కొనేవారట.

హీరోయిన్లకు లక్కీ హీరో..
జయప్రదకు సిరిసిరి మువ్వ సినిమా, శ్రీదేవికి పదహారేళ్ల వయసు తెలుగులో మొదటి సినిమాలు. ఈ సినిమాల్లో నటుడు చంద్రమోహన్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జయప్రద, శ్రీదేవి స్టార్ హీరోయిన్లుగా పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. చంద్రమోహన్ హీరోగా 175కుపైగా, మొత్తం 932 సినమాల్లో నటించారు. ఇక చివరిగా సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన కోతల రాయుడు సినిమాలో నటించారు.
ఇక అప్పటి నుంచి సినిమాకు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే చంద్రమోహన్ భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పారు. "చంద్రమోహన్ ను లక్కీ స్టార్ గా అప్పటి హీరోయిన్స్ భావించేవారు. ఆయన చేత్తో ఒక రూపాయి అయినా తీసుకునేవారు. ఇప్పటికీ జనవరి ఫస్ట్ తేదికి చాలా మంది ఇంటికి వచ్చి అలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు" అని జలంధర తెలిపారు.

ఆయన మాట వినలేదు..
చంద్రమోహన్ మాట్లాడుతూ.. "నేను శోభన్ బాబుగారి మాట వినలేదు. అందువల్ల రూ. 100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాను. కొంపల్లి దగ్గర గొల్లపూడి మారుతీరావు గారి మాటలు విని 35 ఎకరాలున్న ద్రాక్ష తోట కొన్నాను. కానీ మ్యానేజ్ చేయలేక అమ్మేశాను. కొంతమంది కబ్జా చేశారు. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. రౌడీలను తీసుకొచ్చి నానా హంగామా చేశారు. అలా అమ్మేయాల్సి వచ్చింది.

కబ్జాల వల్ల అమ్మేశాను..
నేను అమ్మిన స్థలాల్లో మంచి మంచి రిసార్ట్ లు వచ్చాయి. అవన్నీ చాలా బాగా డెవలప్ అయ్యాయి. ఇక అప్పుడు చేసేది లేక అలా కబ్జాలు, రౌడీల గొడవ ఎక్కువైంది. దీంతో అమ్మేయడం మంచిదని అమ్మేశాను. అలాగే చెన్నైలోనూ 15 ఏకరాలు అమ్మేశాను. శంషాబాద్ దగ్గర 6 ఎకరాలు కొన్నాను. అది కూడా అమ్మేశాను. కానీ శోభన్ బాబు గారు వద్దని వారించినా నేను వినలేదు. అలా రూ. 100 కోట్ల వరకు ఆస్తి పొగోట్టుకున్నాను" అని చెబుతూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











