కెమెరామెన్ స్టడీకామ్ ప్రసాద్ కన్నుమూత

దేశంలోనే ప్రముఖ స్టడీకామ్ ఆపరేటర్గా పేరొందిన ప్రసాద్.. మణిరత్నం, ప్రియదర్శన్, రామ్గోపాల్వర్మలాంటి ప్రముఖ దర్శకుల సినిమాలకు పని చేశారు. దేశంలోని ప్రముఖ చలనచిత్ర పరిశ్రమలన్నింటిలోనూ స్టడీకామ్ ఆపరేటర్గా పని చేశారు. ఆ తర్వాత 'నిన్నేపెళ్లాడతా'తో ఛాయాగ్రాహకుడిగా మారి దక్షిణాది భాషల్లో సుమారు 35 సినిమాలకుపైగా పని చేశారు.
స్టడీకామ్ ప్రసాద్ పూర్తి పేరు కుంపట్ల సూర్యదుర్గ వరప్రసాద్. 1960లో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో జన్మించారు. ఆయనకి భార్య అంజలి, కుమార్తెలు సంజన, ఐశ్వర్య ఉన్నారు. ప్రసాద్ ఏడో తరగతి చదువుతున్న రోజుల్లోనే తన బావ తిరుమనాథం నాగేశ్వరరావు సహాయంతో చెన్నై వెళ్లిపోయారు. అక్కడ సంధ్య అవుట్డోర్ యూనిట్లో కెమెరా అసిస్టెంట్గా పనిలో చేరారు. ఆ తర్వాత ప్రముఖ చాయాగ్రాహకుడు హరి అనుమోలు దగ్గర సహాయకుడిగా చేరారు.
ఆ సమయంలో రాజుమీనన్ దగ్గర స్టడీకామ్ వినియోగంపై శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత పి.సి.శ్రీరామ్, సంతోష్శివన్, అశోక్కుమార్, ప్రియదర్శన్ల సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. రామ్గోపాల్వర్మ తీసిన 'రాత్రి', 'రంగీల', 'అంతం', 'గోవిందా గోవింద' చిత్రాలకు స్టడీకామ్ ఆపరేటర్గా పని చేయడంతో ప్రసాద్ పేరు కాస్తా స్టడీకామ్ ప్రసాద్గా మారింది.
ఆ తర్వాత నాగార్జున 'నిన్నే పెళ్లాడుతా' ద్వారా ఛాయాగ్రాహకుడిగా పరిచయమై 'స్వయంవరం', 'చిరునవ్వుతో', 'నరసింహ', 'మాయగాడు', 'అల్లరే అల్లరి', 'హనుమాన్ జంక్షన్', 'గులాబి', 'కళ్యాణరాముడు', 'రామాచారి', 'డేగ' వంటి సినిమాలకు పని చేశారు. ప్రసాద్ అంత్యక్రియలు ఆతని స్వస్థలమైన అంబాజీపేటలో సోమవారం జరుగుతాయి. ప్రసాద్ మృతికి వన్ ఇండియా తెలుగు సంతాపం తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











