జై బోలో తెలంగాణకు వస్తున్న రెస్పాన్స్పై శంకర్ ఆనందం
జై బోలో తెలంగాణ సినిమాకు లభిస్తున్న ఆదరణపై సినిమా దర్శకుడు ఎన్. శంకర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్ల వద్ద జాతరలాగా ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇది ప్రజల గొప్పతనమని, ఇది ప్రజల విజయమని ఆయన అన్నారు. సీమాంధ్రలో కూడా మంచి ఆదరణ లభిస్తోందని, విజయవాడ పోలీసు కమిషనర్ సినిమా చూసి మెచ్చుకున్నారని ఆయన చెప్పారు. సినిమాలో ఏ ప్రాంత ప్రజలను కూడా కించపరచలేదని ఆయన చెప్పారు. సినిమాపై తెలంగాణేతర ప్రాంతాల ప్రజలకు సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు.
కళాకారులను ప్రజలు ఆదరిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ గాయాలు, గాథలు, కన్నీటి వ్యథలు, తెలంగాణ పోరాటాలు, త్యాగాలతో సినిమా రూపుదిద్దుకుందని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల ప్రజలు తెలంగాణ ప్రజలను ఈ సినిమా ద్వారా అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు. కళాకారుడిగా తనను ఆదరించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు 25 ఏళ్ల తర్వాత సినిమా చూస్తున్నారని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











