ఆర్య 2 లాంటి సమస్యతో షారూఖ్ చిత్రానికి
ఆర్య 2, సలీం చిత్రాలను రిలీజ్ చేయటానికి వీల్లేదంటూ ప్రత్యేక తెలంగాణావాదులు పట్టుపట్టి ఆపుచేసినట్లుగానే ముంబాయిలోనూ షారూఖ్ ఖాన్ చిత్రానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. షారూఖ్ లేటెస్ట్ చిత్రం 'మై నేమ్ ఈజ్ ఖాన్'ను నిషేదించాలంటూ షారుఖ్ ఖాన్ ఇంటి వద్ద ఆదివారం శివసేన కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకోకపోవడాన్ని తప్పుబట్టిన ఆయనపై సేన మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాంద్రాలోని షారుఖ్ నివాసం 'మన్నట్' వద్ద సేన నేత అనిల్ ప్రణబ్ నేతృత్వంలో కార్యకర్తలు ముంబయి-పాకిస్థాన్ టికెట్ను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తంచేశారు.
పాకిస్థాన్ ఆటగాళ్లకు అనుకూలంగా మాట్లాడాలనుకుంటే షారుక్ ఆ దేశానికే వెళ్లిపోవాలని వారు పేర్కొన్నారు. ఇది దేశభక్తికి సంబంధించిన అంశమని, రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకోకూడదని వారు చెప్తున్నారు. అలాగే 'మై నేమ్ ఈజ్ ఖాన్'ను ప్రదర్శించొద్దని థియేటర్ యజమానుల అసోసియేషన్ కు శివసేన లేఖ రాసింది. ఈ చిత్రం ఈ నెల 12న ప్రపంచమంతటా విడుదల కానుంది. ఇందులో షారూఖ్ సరసన కాజల్ నటిస్తోంది. కరుణ్ జోహార్ చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











