‘బాహుబలి’కి లీగల్ కాంట్రవర్సీపై నిర్మాత స్పందన
హైదరాబాద్: ప్రభాస్, అనుష్క జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కర్ణాటక, కర్కాళ కి చెందిన జైన మఠం నుంచి లీగల్ నోటీస్ అందినట్లు ఇటీవల మీడియాలో ప్రచారం జరిగింది. హింసాత్మక చిత్రానికి 'బాహుబలి' అనే టైటిల్ పెట్టవద్దని, వెంటనే టైటిల్ తొలగించాలని ఆ నోటీసులో జైనులు కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. బాహుబలిగా పిలవబడే గోమఠేశ్వర విగ్రహం కర్ణాటక లోని శ్రావణబెళగొళ లో ఉంది. నిస్వార్ధానికి, త్యాగానికి ప్రతీకగా జైనులు ఈ విగ్రహాన్ని కొలుస్తారు.
కాగా....ఈ వార్తలపై 'బాహుబలి' చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. 'ఇప్పటి వరకైతే నేను కంప్లైట్ చూడలేదు. ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బాహుబలి అనేది ఒక కల్పిత కథ(ఫిక్షనల్ స్టోరీ). జైనుల గురువు బహుబలి జీవితం గురించి ఈ సినిమా తీయడం లేదు' అని తెలిపారు.

సినిమా వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











