ఎస్పిబి నేతృత్వంలో రాయల్టీ కోసం సింగర్ల డిమాండ్
చెన్నై : ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెజె ఏసుదాసు, పి సుశీల తదితరులంతా సమావేశమై సింగర్లకు ఇకపై రాయల్టీ చెల్లించాలని, రాయల్టీ పొందడం సింగర్ల హక్కు అని డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆగస్టు 19న చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ రాయల్టీ డిమాండ్లను వెల్లడించారు.
'మా ఉద్దేశం ఎవరిపైనా పోరాడటానికి కాదు. మా వాయిస్ వాడుకుంటే రాయల్టీ రూపంలో డబ్బు చెల్లించాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి పోరాటాలు చేసే ఉద్దేశ్యం మాకు లేదు. ఎందుకంటే రాయల్టీ పొందడం మా హక్కు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయల్టీ పొందేందుకు సింగర్లంతా అర్హులే' అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.

మరొక సింగర్ హరిహరన్ మాట్లాడుతూ...కాపీరైట్ యాక్ట్ ప్రకారం, అందరు సింగర్లూ రాయల్టీ పొందేందుకు అర్హులే అని వ్యాఖ్యానించారు. ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క హక్కుల పరిరక్షణకు కమిటీ పని చేస్తుందని తెలిపారు. గత సంవత్సరం జూన్ నెలలో పాసైన కాపీరైట్ యాక్ట్ ప్రకారం 1963 నుంచి వచ్చిన ప్రతి సాంగు కాపీరైట్ యాక్ట్ కిందకు వస్తుంది' అని తెలిపారు.
సింగర్లు చేస్తున్నరాయల్టీ డిమాండ్ ప్రకారం....ఒక సినిమా కోసం ఒక సింగర్ పాట పాడి డబ్బులు తీసుకున్న తర్వాత కూడా, ఆ పాటను భవిష్యత్లో ఏరకంగా వాడుకున్నా, ఆ పాటల ద్వారా ఏ రకంగా లాభం పొందినా రాయల్టీ రూపంలో మరికొంత డబ్బు పొందే హక్కు వారికి ఉంటుంది. ఈ సమావేశంలో ఎస్పి చరణ్, నరేష్ లైయర్, వాని జయరాం, మనో, కార్తీక్, శ్రీనివాస్, టిప్పు మరికొంత మంది సింగర్లు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











