బ్రేకింగ్.. ‘శ్రీదేవి’ అప్పగింత కష్టమే.. నోరువిప్పని అధికారులు.. ఫ్యామిలీ పడిగాపులు..
ప్రముఖ నటి శ్రీదేవి మరణం సహజమని తొలుత భావించినప్పటికీ, ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుండటంతో ఆమె పార్దీవదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో జాప్యం జరుగుతున్నది. శ్రీదేవి మృతదేహాన్ని స్వదేశానికి తరలింపుకు అన్ని రకాల ప్రక్రియలు పూర్తయితే తప్ప ఆమె దేహాన్ని అప్పగించలేమని రాయబార కార్యాలయ అధికారులు వెల్లడిస్తున్నారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసే నివేదిక గురించి శ్రీదేవి కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నారు.

అంతకుమించి ఏమీ చెప్పలేం..
దర్యాప్తు ప్రక్రియ తీరు గురించి మాట్లాడటానికి దుబాయ్ అధికారులు నిరాకరిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకు మించి తాము ఏమీ చెప్పలేము అని వారు పేర్కొంటున్నారు. శ్రీదేవి మృతదేహం అప్పగింత వ్యవహారంలో మంగళవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి పురోగతి కనిపించకపోవడం బంధువులను వేదనకు గురిచేస్తున్నది.

సాధారణ పద్ధతులనే..
దుబాయ్ పోలీసులు సాధారణంగా అనుసరించే పద్దతులనే పాటిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరుగడం లేదు. వారి ప్రమాణాలకు అనుగుణంగా పోలీసులు తమ దర్యాప్తు సాగిస్తున్నారు అని భారతీయ రాయబార కార్యాలయ అధికారి వెల్లడించారు.

100 శాతం దర్యాప్తు పూర్తయితే
అనుమానాస్పద మృతి కేసులో 100 శాతం దర్యాప్తు పూర్తయితే తప్ప మృతదేహాన్ని అప్పగించలేరు. శ్రీదేవి విషయంలోను అదే జరుగుతున్నది. హాస్పిటల్లో చనిపోతే ఈ ప్రక్రియ మరింత సులభం అయ్యేది. హోటల్లో చనిపోవడం వల్ల అనేక రకాలుగా దర్యాప్తు చేయాల్సి వస్తున్నది అని భారతీయ అధికారులు పేర్కొన్నారు.

సున్నితమైన కేసుగా
శ్రీదేవి మరణం చాలా సున్నితమైన కేసుగా మారింది. ఈ ఘటనలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎలాంటి అనుమానాలకు తావివ్వని విధంగా దర్యాప్తు పూర్తి చేస్తున్నాం అని అధికారులు స్పష్టం చేశారు.

ప్రాసిక్యూటర్ క్లియరెన్స్ కోసం..
శ్రీదేవి మరణించి మూడోరోజుకు చేరుకున్నది. ఆమె మృతదేహం దుబాయ్ మార్చురిలో ఉంచారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్లియరెన్స్ లభిస్తే గానీ, ముహైస్నాలోని ఎంబాల్మింగ్ యూనిట్కు తరలిస్తాం అని దుబాయ్ పోలీసులు వెల్లడించారు.

అనుమతుల వస్తే తప్ప..
శ్రీదేవి మృతదేహాన్ని భారత్కు అప్పగించేందుకు మరికొన్ని అనుమతులు అవసరం. దుబాయ్ ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నాం అని యూఏఈలో భారత రాయబారి అయిన నవ్దీప్ సూరి వెల్లడించారు.

రెండు, మూడు రోజులు పట్టే
ఇలాంటి కేసుల్లో గత సంఘటనలను పరిశీలిస్తే.. ప్రక్రియ పూర్తి కావడానిక 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. మృతదేహానికి ఎంబాల్మింగ్ ప్రక్రియ ఈరోజు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది అని ఆయన వెల్లడించారు.

గాసిప్స్తో ఉపయోగం లేదు
శ్రీదేవి అకాల మరణంపై మీడియా చూపించే ఆసక్తిని అర్థం చేసుకోగలం. అయితే గాసిప్ వార్తలు ఏ మాత్రం ఉపయోగపడవు అని సూరి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ కేసులో శ్రీదేవి భర్త బోనీ కపూర్ను విచారించినట్లు వచ్చిన వార్తలను దుబాయ్ పోలీసులు ఖండించారు.

అప్పగింతలో మరింత జాప్యం
అయితే శ్రీదేవి మృతదేహాన్ని మంగళవారం ముంబైకి తరలించే అవకాశాలు చాలా కష్టంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్న తీరు బట్టి అర్థమవుతున్నది. దుబాయ్ ప్రాసిక్యూషన్ కేసులో తీవ్రత ఉన్నట్టు భావిస్తే తరలింపు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

అనిల్ అంబానీ విమానంలో
అన్ని ప్రక్రియలు ముగిసిపోయిన అనంతరం ఆమె భౌతికకాయాన్ని ఛార్టర్డ్ విమానంలో ముంబయికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ జెట్ విమానాన్ని పంపిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











