చీకటి గదిలో చితక్కొట్టుడు: ఓ వైపు కలెక్షన్ల జోరు, మరో వైపు బూతులున్నాయంటూ ఆందోళన!
'చీకటి గదిలో చితక్కొట్టుడు'... ఈ మూవీ ట్రైలర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అరుణ్ అదిత్ , హేమంత్ , నిక్కీ తంబోలి ప్రధాన పాత్రల్లో అడల్ట్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ జోడించి బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్పై సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
మార్చి 21న విడుదలైన ఈ సినిమాపై పలు చోట్ల నిరసన వ్యక్తం అయ్యాయి. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో పోస్టర్లు చించివేశారు. చిత్ర ప్రదర్శన వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

యువతను తప్పుతోవ పట్టిస్తూ కాసుల కోసం..
యువతను ఎట్రాక్ట్ చేస్తూ కాసుల కోసం బూతు సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకోబోమని మహిళా సంఘాల నేత రేఖ హెచ్చరించారు. సామాజిక బాధ్యత లేకుండా దర్శకులు, నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీస్తున్నారని మండి పడ్డారు.

సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది?
ఇలాంటి బూతు సినిమాలకు అనుమతి ఇవ్వడం చూస్తుంటే సెన్సార్ బోర్డులో డబ్బుల కోసం పని చేస్తున్నవారు ఉన్న భావన కలుగుతోందని, సామాజిక బాధ్యత లేకుండా ఇలాంటి సినిమాలకు అనుమతి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ‘ఎ' సర్టిఫికెట్ ఇచ్చేశామని అంటున్నారు... ప్రజలకు ‘ఎ' సర్టిపికెట్ ‘యు' సర్టిఫికెట్ మీద పెద్దగా అవగాహన లేదు, వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం సెన్సార్ బోర్డు మీద ఉందని రేఖ వ్యాఖ్యానించారు.

సమాజానికి చెడు చేసే సినిమాలు
గతంలో అర్జున్ రెడ్డి, 24 కిస్సెస్, ఆర్ఎక్స్ 100, రామ్ గోపాల్ వర్మ తీసిన బూతు సినిమాలకు కూడా సెన్సార్ బోర్డు ఇదే విధంగా అనుమతి ఇచ్చింది. ఇలాంటి సినిమాలు సమాజానికి చెడు చేసేవే తప్ప మంచి చేసే సినిమాలు కాదని రేఖ తెలిపారు.

కలెక్షన్ల జోరు...
ఓ వైపు నిరసనలు వ్యక్తం అవుతున్నా.... కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. హోళీ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇదే సినిమాతో పాటు విడుదలైన అక్షయ్ కుమార్ ‘కేసరి', మోహన్ లాల్-విశాల్ మూవీ ‘పులి జూదం' చిత్రాలు కలెక్షన్ల పరంగా వెనకబడిపోయాయి.


Click it and Unblock the Notifications











