మహేష్ కాదన్నాడని మీడియాతో చెప్పలేదు కదా
హైదరాబాద్ : మణిరత్నం చిత్రాల గురించి మీడియాతో మాట్లాడిన సుహాసినికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. నాగార్జున, మహేష్ లతో చెయ్యాల్సిన సినిమా ఆగిపోవటంతో మీడియావారు అదే ప్రశ్న అడుగుతున్నారు. ఎప్పుడు మొదలవుతుంది..ఆగిపోయిందంటున్నారు...వంటి ప్రశ్నలతో సుహాసిని పై దాడి చేస్తున్నారు. మణిరత్నం వచ్చి ..ఆ సినిమా ఆగిపోయిందని ఓ ప్రెస్ నోట్ ఇచ్చినా సరిపోయేది..సుహాసినికి ఈ తలపోటు తప్పేది అంటున్నారు.
అయితే సుహాసిని మాత్రం చాలా ఓపిగ్గా సమాధానం చెప్తోంది. సినిమా చేస్తామన్న హీరోలు నాగార్జున, మహేష్ బాబు బాగానే ఉన్నాడు,దర్శకుడు మణిరత్నం బాగానే ఉన్నాడు..మధ్యలో సుహాసిని ఇలా ఇరుక్కుపోయింది అంటున్నారు. మహేష్ కథ నచ్చక నో చెప్పటంతోనే ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున ఈ ప్రాజెక్టు లేదని ఖరారు చేసి చెప్పేసాడు. అయితే మహేష్ కాదన్నాడని ఆమె మీడియాతో ఎలా చెప్తుంది అని అంటున్నారు.

సుహాసిని మాట్లాడుతూ... మణిరత్నం తీసే సినిమాల్లో నా పాత్ర ఏమీ వుండదు. కథ ఏమిటో తెలుసుకొని దానిపై నా అభిప్రాయాన్ని మాత్రం చెబుతాను. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున, మహేష్బాబు చేయాల్సిన సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. అందరినీ మెప్పించే చక్కటి చిత్రంతో మణిరత్నం త్వరలో ప్రేక్షకులముందుకొస్తారు అంటున్నారు సుహాసినీ మణిరత్నం.
తెలుగు సినిమాల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్తూ... నేనిప్పటివరకు 285 చిత్రాల్లో నటించాను. వాటిలో తెలుగు సినిమాలే వందకుపైగా వున్నాయి. నేను పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు ప్రజలతో గొప్ప అనుబంధముంది. మంచి మనిషిగా వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుగు సినిమా, తెలుగు ప్రజలను చూసి నేర్చుకున్నాను. తెలుగుప్రేక్షకుల్ని కలుసుకోవడం నాకెప్పుడూ ఆనందంగా వుంటుంది. తెలుగులో మరపురాని చిత్రాల్ని చేశాను. కమర్షియల్ సినిమాల కంటే సహజత్వాన్ని , వాస్తవికతను ప్రతిబింబించే సినిమాల్ని చేయడానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను అన్నారు.


Click it and Unblock the Notifications











