'నువ్వుంటే బాగుండేది నాన్నా...!' సుకుమార్ లెటర్ లో
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన నాన్నకు ప్రేమతో చిత్రం మంచి విజయం సాధిస్తూ భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఆయన తండ్రిని తలుచుకున్నారు. సుకుమార్ తండ్రి బండ్రెడ్డి తిరుపతిరావు నాయుడు మరణపు అంచులపై ఉన్నప్పుడు ‘నాన్నకు ప్రేమతో' కథ పుట్టింది.
తన తండ్రి మరణానంతరం ఆయన్ని గుర్తుచేసుకొంటూ.. సుకుమార్ చెప్పుకొచ్చిన భావాల్ని ఉత్తరంగా మలిచింది ఈనాడు సినిమా. దాన్ని సుకుమార్ తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసారు.
Posted by Sukumar B on 20 January 2016
అది ఇదే..దాన్ని మీకు అందిస్తున్నాం.
ఇందులో.... నువ్వున్నప్పుడు నీకు ఉత్తరం రాసే తీరిక లేదు.. ఆ అవసరమూ రాలేదు.. నీకు, నీ ఆలోచనలకు దూరంగా.. పెన్నూ పేపరు పట్టుకొని ఏదేదో రాసుకొంటూ కూర్చునేవాడ్ని. నా ఆలోచనల్లో.. ఆ అక్షరాల్లో అన్నీ ఉండేవి.. నువ్వు తప్ప అంటూ భావోద్వేగంగా రాసారు. మీరు చదవండి మరి.
ముఖ్యంగా...నీ చిన్నప్పటి జ్ఞాపకాలు, ‘సతీ సక్కుబాయ్' నాటకంలో కృష్ణుడిగా నువ్వు చూపించిన చిలిపిదనం, ‘పూల రంగడు'లో నువ్వు చెప్పిన డైలాగులు, ఆ రోజుల్లో స్టేజీమీద గొంతెత్తి ఆలపించిన పద్యాలు.. ఇవన్నీ పూస గుచ్చినట్టు కనుక్కొనేవాడ్ని. నీతో కబుర్లు చెబుతూ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా భోంచేసేవాడ్ని.నిజ్జంగా నువ్వుండుంటే చాలా బాగుండేది నాన్నా.. అన్నప్పుడు ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి.

బతికున్నన్నాళ్లూ మన వూరు దాటలేదు. అందుకే ఒక్కసారైనా విమానం ఎక్కిద్దామని, విదేశం చూపిద్దామని ఎంత అనుకొన్నానో..! ఆ కల తీర్చుకొనేవాడ్ని. షూటింగ్ కోసం లండన్ వెళ్తే.. ‘ఈసారి నాన్ననీ తీసుకురావాలి' అనుకొనే వీలైనా ఉండేది.. కానీ ఇప్పుడు అనంతమైన విశ్వంలో, నాకు నేను ఛేదించుకోలేని శూన్యంలో నేను మాత్రమే మిగిలాను అంటూ ఎన్నో ఎమోషన్స్ ని మనలో తట్టి లేపుతుందీ ఉత్తరం.


Click it and Unblock the Notifications











