తనికెళ్ల భరణి నాటకోత్సవాలు ప్రారంభం
తెలుగు నాటకానికి ఆధునిక హంగులద్దిన 'తనికెళ్ల భరణి నాటకోత్సవాలు' గురువారం రవీంద్రభారతి వేదికపై ప్రారంభమయ్యాయి. 'సంగమం, కనకధార'ల ఆధ్వర్యంలో 'సంగమం రంగస్థల సంబరం-2013' శీర్షికన ఇవి ప్రారంభమయ్యాయి. తొలిగా ప్రదర్శించిన 'జంబూద్వీపం' నాటిక సమకాలీన పరిస్థితులకు అద్దంపట్టింది. ప్రదర్శితమైన రెండో నాటికలో పట్టభద్రుడై.. ప్రతిభా ఉండి అనతికాలంలో ఉపాధి అవకాశాలు లభించని పక్షంలో ఆ నిరుద్యోగి మానసికస్థితి ఎలాంటి రూపం ధరిస్తుందో కళ్లకుకడుతూ.. ప్రదర్శించిన 'కొక్కొరోకో' నాటిక ప్రదర్శన వీక్షకులను ఆలోచింపజేసింది.
అనంతరం ప్రదర్శితమైన డా.చేబియ్యం శ్రీనివాసన్ దర్శకత్వంలో ప్రదర్శితమైన 'గో..గ్రహణం' నాటిక ప్రస్తుత సమాజంలో మహిళ ఉన్మాదానికి బలైవుతున్న తీరును ఎండగట్టింది. సభలో దర్శకులు కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు, మిథునం నిర్మాత ఆనందరావు, నటుడు జయప్రకాశ్రెడ్డి, ఎల్బీ శ్రీరామ్, అలపాటి లక్ష్మీ, డబ్బింగ్ జానకిలు కళాకారులను అభినందించారు. తనికెళ్లభరణి మాట్లాడుతూ.. తెలుగు నాటకానికి మంచి భవిష్యత్తు ఉంది. అయితే నాటకాన్ని టికెట్టు కొని చూస్తే కచ్చితంగా బతుకుతుందన్నారు. శుక్రవారం 'ఛల్ ఛల్ గుర్రం', 'గార్థభాండం' నాటికలు ప్రదర్శిమవుతాయని తెలిపారు.
తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తేవాలన్నదే తన జీవిత లక్ష్యమని ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి తెలిపారు. నాటకోత్సవాల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో హిందీ, విదేశీ భాషల నాటకాలు విరివిగా ప్రదర్శిస్తున్నారని చెప్పారు. నాటకాలు జనరంజకంగా ఉంటే ప్రజలు ఆదరిస్తారన్నారు. టికెట్ కొని నాటకాలు చూసే పరిస్థితి అభివద్ధి చెందితే.. తెలుగులో గొప్ప నాటకాలు వస్తాయని చెప్పారు. తెలుగు నాటకాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. 30 ఎళ్ల క్రితం తాము నాటకాలు రాసి, వేసినప్పటి పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంగమం సంజయ్ కిషోర్, నటుడు జయప్రకాష్రెడ్డి, డబ్బింగ్ జానకి, ఆలపాటి లక్ష్మి, దర్శకుడు శివనాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications












