నేనేం నేరం చేశాను, బాధితురాలినే: సినీ నటి తారా చౌదరి
విజయవాడ: తాను నిందితురాలిని కాదనీ బాధితురాలిని మాత్రమేనని, పోలీసులు తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని, అలా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని సినీ నటి తారాచౌదరి అలియాస్ రాజేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం నేరం చేశానని విజయవాడ పోలీసులు తనపై రౌడీషీటు, పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
పోలీసులపై తాను న్యాయపోరాటం చేస్తానంటూ ప్రకటించారు. తారాచౌదరి కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ నగర శివారు సింగ్నగర్ పోలీస్టేషన్ పరిధిలోని శాంతినగర్లో అద్దెకుంటున్న అన్నావదిలతో తారాచౌదరికి జరిగిన గొడవను పురస్కరించుకుని మహిళా పోలీసు కానిస్టేబుల్ జ్యోతిపై రగడకు దిగారు.
దాంతో ఆమెపై నున్న రూరల్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇటీవల ఆమె జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. అయితే తారాచౌదరిపై పీడీ యాక్టు, రౌడీషీటు తెరుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆదివారం సాయంత్రం గాంధీనగర్లోని తన న్యాయవాది జయప్రకాష్తో కలిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

తనపై విజయవాడ పోలీసులు రౌడీషీటు తెరుస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆమె మండిపడ్డారు. అంతటి నేరాలేమీ తాను చేయలేదని, గతంలో హైదరాబాద్లో బంజారాహిల్స్ పోలీస్టేషన్లో ఏసిపి శంకర్రెడ్డి అప్పట్లో అక్రమ కేసులు బనాయించారని, ఇప్పుడు తాజాగా విజయవాడ పోలీసులు కూడా కక్ష సాధింపు దిశగానే తన పట్ల వ్యవహరించి అరెస్టు చేశారని ఆరోపించారు.
తన సోదరుడు శ్రీనివాస్, వదినల మధ్య నెలకొన్న ఆస్తి సంబంధ వ్యవహారాల నేపథ్యంలోనే ఈ నెల 11న వదిన కవిత ఫిర్యాదు మేరకు నున్న పోలీసులు కేసులు బనాయించారన్నారు. ఆ సమయంలో తన పట్ల ఎస్ఐ శివప్రసాద్ అమానుషంగా వ్యవహరించారని, అర్ధరాత్రి నున్న శివారులోని నిర్మానుష్యమైన రోడ్డులో వాహనంలో ఎక్కించి తిప్పారంటూ ఆరోపించారు.


Click it and Unblock the Notifications











