సిసిఎల్ 3: క్రికెట్ లోనూ వెంకటేష్ హిట్ (ఫోటోలతో..)
సిలిగురి: తెలుగు హీరోలు వెండితరపైనే కాదు ...క్రికెట్ పిచ్ మీద కూడా రెచ్చిపోయి విజయాలు సొంతం చేసుకోగలరని నిరూపించారు.సెలబ్రెటీ క్రికెట్ లీగ్లో భాగంగా సిలిగురిలో జరిగిన మ్యాచ్లో బెంగాల్ టైగర్స్పై తెలుగు వారియర్స్ ఘనవిజయం సాధించింది. చూస్తున్న అభిమానులలో ఆనందం నింపింది.
తొమ్మిది వికెట్ల తేడాతో టైగర్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగాల్ వారియర్స్ 68 పరుగులకు ఆలౌటయింది. అనంతరం బరిలోకి దిగిన వారియర్స్ 10.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వారియర్స్ ఓపెనర్ ఆదిత్య ఆకట్టుకున్నాడు. ఇతను 38 బంతుల్లో 55 పరుగులు సాధించాడు.

పక్కా ప్రొఫెషనల్స్గా బరిలోకి దిగి.. నిజమైన క్రికెట్లోని వినోదం పంచారు మన సినీ తారలు. సెలబ్రెటీ క్రికెట్లీగ్ (సీసీఎల్) రెండో రోజూ ఉత్సాహంగా సాగింది.

పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఆదివారం జరిగిన రెండు మ్యాచ్లూ ఏకపక్షంగా సాగినా - వీక్షకులకు మాత్రం వినోదం పంచిపెట్టాయి.

ఏదో సరదాకి ఆడుతున్నట్టు కాకుండా... నిజం క్రికెటర్లు మాదిరిగానే బంతి బంతికీ వ్యూహ రచన. డైవ్లు చేస్తూ ఆడటం అందరినీ ఆకట్టుకుంది. బంతిని స్వింగ్ చేయటం,లెగ్ బ్రేక్లూ, ఆఫ్ బ్రేక్లూ విసురటం చేస్తూ తమ ప్యాన్స్ కు అభిమాన హీరోలు ఆనందాన్ని పంచారు.

మ్యాచ్ బెంగాల్లో జరగడంతో... స్థానిక జట్టుకే ఎక్కువ మద్దతు లభించింది. అయితే తెలుగు వారియర్స్ వికెట్ తీసినప్పుడూ, పరుగులు సాధించినప్పుడూ స్టేడియం మార్మోగింది.

'మా జట్టులో ఆల్రౌండర్లు ఉన్నారు..' అని వెంకటేష్ చెప్పిన మాటల్ని నిజం చేస్తూ, తెలుగువారియర్స్ జట్టు ఆల్రౌండ్ ప్రతిభ చూపించింది. తొలి మ్యాచ్లోనే తడాఖా చూపించింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తూ.. బెంగాల్ వారియర్స్ని చిత్తు చేసింది.

తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఈ సీజన్ని ఘనంగా ప్రారంభించింది. సిలిగురిలో ఆసాంతం... తెలుగు వారియర్స్దే హవా.

టాస్ గెలిచిన వెంకటేష్ తొలుత బెంగాల్ వారియర్స్ని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. వెంకీ ఎత్తుగడ ఫలించింది. బెంగాల్ ఎక్కడా కుదురుగా పరుగులు చేయలేకపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో పాటు, ఫీల్డింగ్ కూడా మెరుగ్గా ఉండడంతో.. బెంగాల్ ఎక్కడా జోరు చూపించలేకపోయింది.

వెంకటేష్ సింగిల్ తీసినా.. జట్టు సభ్యులు కేరింతలు కొట్టారు. హీరోయిన్స్ రైమాసేన్ బెంగాల్ జట్టుకూ, శియా గౌతమ్ తెలుగు వారియర్స్కీ మద్దతు తెలిపారు.

18.5 ఓవర్లలో కేవలం 68 పరుగులకు ఆలౌట్ అయింది. బెంగాల్ జట్టులో జిషు అత్యధికంగా 29 పరుగులు చేశాడు. రఘు, చరణ్తేజ్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ముగ్గురు రనౌట్ అయ్యారు.

స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ప్రారంభం నుంచీ జోరుగా ఆడింది.

ఓపెనర్లుగా వచ్చిన వెంకటేష్, ఆదిత్యలు మంచి ప్రారంభం అందించారు. ముఖ్యంగా ఆదిత్య (56 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు. అతని స్కోరులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

వెంకీ (21 బంతుల్లో 4) నెమ్మదిగా ఆడినా.. ఆదిత్యకు మంచి సహకారం అందించారు. మరో 59 బంతులు ఉండగానే తెలుగు వారియర్స్ విజయం సాధించింది. శ్రీకాంత్ 4 పరుగులతో నాటౌట్గా నిలిచారు.

ఆదిత్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రఘుకి ఎఫిషియెంట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు.

''బెంగాల్ టైగర్స్ మంచి జట్టు. మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. ప్రారంభంలో వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. మా జట్టు సమతూకంలో ఉంది. లక్ష్య ఛేదనలో మేం ఎప్పుడూ మెరుగ్గానే ఉంటాం. అందుకే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొన్నా. భారీ లక్ష్యం కాకపోవడంతో సునాయాసంగా గెలిచాం. ఇకముందూ ఇదే జోరు కొనసాగిస్తాం''
- వెంకటేష్

''కేవలం కెమెరా ముందు నటిస్తారంతే అనుకొంటాం. కానీ వాళ్లలో ఇంత ప్రతిభ ఉంటుందని వూహించం. సినిమావాళ్లు ఏదైనా సరే.. మనసు పెట్టి చేస్తారు. సీసీఎల్ సందడి సందడిగా సాగుతోంది. రాబోయే మ్యాచ్లు కూడా ఇంతే ఉత్సాహంగా సాగుతాయనే నమ్మకం ఉంది''
- శ్రీదేవి, బెంగాల్ టైగర్స్ యజమాని
ఈనెల 17న హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో తెలుగు వారియర్స్, ముంబయి హీరోస్తో తలపడుతుంది. సీసీఎల్ 2లో సెమీఫైనల్ వరకూ వెళ్లిన... తెలుగు వారియర్స్ ఈసారి కప్పుపై గురి పెట్టింది. అందుకే సిలిగురిలో ఘనమైన ఆరంభం ఇచ్చింది. తొమ్మిది వికెట్లతేడాతో విజయభేరీ మోగించి ప్రత్యర్థులకు సంకేతాలు పంపింది.


Click it and Unblock the Notifications











