'తుఫాన్' ఆడియో విడుదల విశేషాలు(ఫోటోలు)
హైదరాబాద్: రామ్చరణ్, ప్రియాంకచోప్రా జంటగా తెరకెక్కిన చిత్రం 'తుఫాన్' . ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు అపూర్వ లకియా, విక్టరీ వెంకటేష్తో పాటు శ్రీహరి, దిల్రాజు, వి.వి.వినాయక్, తనికెళ్ల భరణి తదితరులు హజరయ్యారు.
''మా నాన్న, బాబాయ్ నాకు నేర్పింది ఒక్కటే... ప్రేక్షకులను అలరించడం. సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమానే మాకు కావాల్సింది అనుకోవాలి అభిమానులు. ఇక మీదట కూడా అదే తరహాలో నా నుంచి చిత్రాలు వస్తాయని'' అన్నారు రామ్చరణ్.
ఈ చిత్రం బాలీవుడ్ లోనూ అదే రోజు విడుదల అవుతోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తుఫా న్ బిజినెస్ ఓ రేంజిలో జరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు వెర్షన్ కు యోగి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ లో రామ్ చరణ్ తన కంటూ గుర్తింపు తెచ్చుకుంటాడని చెప్తున్నారు.
ఈ చిత్రం ఆడియో విశేషాలు..స్లైడ్ షోలో...

భారీగా...
రామ్ చరణ్ హీరో గా నటించిన చిత్రం 'తుఫాన్'. హిందీలో 'జంజీర్'గా తెరకెక్కింది. ప్రియాంక చోప్రా నాయిక. అపూర్వ లఖియా దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్, ఫ్త్లెయింగ్ టర్త్టెల్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి. మీత్ బ్రదర్స్, చిరంజన్ భట్, ఆనంద్రాజ్ ఆనంద్, అంజన్ సంగీతం అందించారు.

వెంకటేష్ చేతుల మీదుగా..
మంగళవారం రాత్రి ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని వెంకటేష్ ఆవిష్కరించారు. అల్లు అరవింద్ స్వీకరించారు. ఈ వేడకకు మెగా కుటుంబ శ్రేయాభిలాషులు హాజరయ్యి ఉత్సాహంగా పండగలా ఈ పంక్షన్ జరిపారు.

వెంకటేష్ మాట్లాడుతూ...
''రామ్చరణ్ 'చిరుత'తో అదరగొట్టాడు. 'నాయక్'తో దుమ్ము దులిపాడు. ఇప్పుడు 'తుఫాన్'గా దేశంలోని అతి పెద్ద పరిశ్రమ అయిన బాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. ఇక్కడిలాగే అక్కడ కూడా అభిమానుల హృదయాలను గెలుచుకోవాలని ఆశిస్తున్నా'' అన్నారు.

వెంకటేష్ కంటిన్యూ చేస్తూ...
‘‘కష్టపడే తత్వం చరణ్ది. తను ఎన్నుకునే కథలు కూడా బావుంటాయి. ఇక్కడ విజయాలు సాధించినట్లే, బాలీవుడ్లో కూడా చరణ్ సక్సెస్ అవాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నేను పెద్దగా మాట్లాడలేకపోయినా... మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా'' అని వెంకటేష్ అన్నారు.

అపూర్వ లఖియా మాట్లాడుతూ ...
''ఈ సినిమాతో రామ్చరణ్కి రాక్స్టార్ ఇమేజ్ వస్తుంది. అతడి నటన అభిమానులను మరోసారి అలరిస్తుంది. ఈ తుఫాన్ వసూళ్ల సునామీగా మారుతుంది. ప్రకాష్రాజ్, శ్రీహరి పాత్రలు చాలా బాగా వచ్చాయి'' అన్నారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ...
''ఈ సినిమాలో కొంత భాగాన్ని చరణ్ నాకు చూపించాడు. చరణ్లో ఓ కొత్త ఆవేశాన్ని, నటుడినీ ప్రేక్షకులు చూస్తారు'' అన్నారు. రామ్ చరణ్ చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

శ్రీహరి మాట్లాడుతూ...
''పాత 'జంజీర్'లో ప్రాణ్ ధరించిన పాత్రని నేను చేస్తున్నాను. 'మగధీర' సమయంలో ఇదే వేదికమీద ఈ సినిమా ఏడాది ఆడుతుందని చెప్పాను. అదే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ 'జంజీర్' హిందీ సినిమా హద్దులను చెరిపేసింది. ఈ సినిమా కూడా ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల హద్దులను చెరిపి కొత్త రికార్డులను సృష్టిస్తుంది'' అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ...
''రామ్చరణ్ ఈ సినిమాతో రెండు అతిపెద్ద చిత్ర పరిశ్రమలను ఏలుతాడు'' అన్నారు. ఈ చిత్రం విజయంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మగధీర రేంజిలో సినిమా ఆడుతుందనే విశ్వాసం వెల్లబుచ్చారు.

తణికెళ్ల భరణి మాట్లాడుతూ...
''యావత్ భారతదేశాన్ని దులిపేసే ఒక సినీ తుఫాన్... ఈ సినిమా. విడుదలైన తర్వాత జన తుఫాన్గా మారి నిర్మాతలకు ధన తుఫాన్ని చేకూరుస్తుంది'' అన్నారు .

రామ్చరణ్ మాట్లాడుతూ...
''ఈ సినిమా చేయాలని నేను నిర్ణయించుకొన్నప్పుడు నన్ను చాలా మంది ప్రశ్నించారు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పుడు హిందీకి ఎందుకు వెళుతున్నావని అడిగారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే. అవసరం కోసం నేను ఏ పనీ చేయలేదు. ఏ సినిమాలూ ఒప్పుకోలేదు. ప్రేక్షకులు నా మీద పెట్టుకొన్న నమ్మకం ఎప్పుడూ వమ్ము కాకూడదనే సినిమాలు అంగీకరిస్తుంటాను. బాలీవుడ్లోకి వెళ్లి తెలుగువాడి సత్తా చూపిస్తానని అంటున్నారు. ఇదేదో నేను కొత్తగా చేస్తున్నది కాదు, మా నాన్న, వెంకటేష్గారు, నాగార్జునగారు ఇదివరకే అక్కడికి వెళ్లి మన సత్తా చూపించారు. నా అభిమానులకు, మా కుటుంబ అభిమానులకు వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను. ఈ సినిమా చూసి నచ్చకపోతే ఎవరైనా నాకొచ్చి చెప్పొచ్చు. నేను ఇలాంటి ప్రయోగాలు చేయడం మానేస్తాను. అయితే ఈ సినిమా మాత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. దీని విడుదల తర్వాత తెలుగు సినిమాల బడ్జెట్టు, నాణ్యత కూడా పెరుగుతాయి. అపూర్వ లఖియా నన్ను ఒక మంచి హీరోగా బాలీవుడ్లో నిలబెడుతున్నాడు''అన్నారు.

రామ్చరణ్ కంటిన్యూ చేస్తూ...
‘‘బాలీవుడ్కి వెళ్లాల్సిన అవసరం చరణ్కి ఎందుకొచ్చింది. ఇక్కడ బాగానే ఉందిగా... చాలామందిని వెంటాడుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఒక్కటే. తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచాలనే బాలీవుడ్కి వెళ్లాను. అంతేతప్ప బాలీవుడ్లో పెద్ద స్టార్ అయిపోవాలని, కోట్లు సంపాదించేయాలని కాదు. అపూర్వ లఖియా నాకు రోజూ ఫోన్ చేసేవారు. ఓ దశలో ఆయన ఫోన్ని లిఫ్ట్ చేయడం మానేశాను. ఇలా 8 నెలలు గడిచాక కథ విన్నాను. బౌల్డ్ అయిపోయాను. అంత నచ్చింది. నాన్నకు ఈ విషయం చెబితే, ‘కథను నమ్ముకొని చేయ్. బాగుంటే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు' అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. శ్రీహరి ఇందులో షేర్ఖాన్గా నటించడం సినిమాకు పెద్ద ఎస్సెట్'' అని చెప్పారు.

వీరంతా...
ఈ కార్యక్రమంలో సంజీవ్, దిల్రాజు, వంశీ పైడిపల్లి, చంద్రబోస్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బండ్ల గణేష్, జస్ప్రీత్ జాన్స్, పంకజ్, షబ్బీర్ అహ్లూవాలియా, అమిత్ సింగ్, కిరణ్సన్ భట్, యోగి, ప్రవీణ్, అంకుర్ భట్, పునీత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

నాయక్
వినాయిక్,రామ్ చరణ్ కాంబినేషన్ లో గతంలో నాయిక్ చిత్రం వచ్చి విజయవంతం అయ్యింది.మెగా హీరోలతో వినాయిక్ కి మంచి ర్యాపో ఉంది. గతంలోనూ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ తో ఠాగార్ చిత్రం తెరకెక్కించి ఘన విజయం సాధించారు.

దిల్ రాజుతో..
ఈ పంక్షన్ కి ఎవడు చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు వచ్చారు. దర్శక,నిర్మాతలిద్దరూ తమ హీరోతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ చిత్రం విడుదల అయ్యాక ఎవడు రిలీజ్ కానుంది.

అల్లు అరవింద్
వివి వినాయిక్,అల్లు అరవింద్ ఇలా ఈ పంక్షన్ లో ముచ్చట్లాడుకుంటూ కనిపించారు. మన బ్యానర్ లో మళ్లీ ఎప్పుడు చేస్తావు అని వినాయిక్ ని అల్లు అరవింద్ అడుగుతున్నట్లుగా ఉంది. వీరి కాంబినేషన్ లో బద్రీనాధ్ చిత్రం వచ్చింది.


Click it and Unblock the Notifications











