నిన్న ‘బాహుబలి’, ఇపుడు ‘డిజె’... బాలీవుడ్కి వార్నింగ్!
తెలుగు సినిమాలు బాలీవుడ్ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ బాలీవుడ్ కి వార్నింగ్ ఇచ్చారు తరణ్ ఆదర్శ్.
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ నుండి 'బాహుబలి' లాంటి భారీ ప్రాజెక్టులు రావడం బాలీవుడ్ పరిశ్రమనే కాదు, దేశంలోని ఇతర సినీ పరిశ్రమలన్నింటినీ ఆశ్చర్య పరిచింది. టాలీవుడ్ పరిశ్రమ నుండి ఇంత పెద్ద హిట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు.
ఇటీవల విడుదలైన మరో తెలుగు మూవీ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'దువ్వాడ జగన్నాథమ్'ఈ మూవీ కూడా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన 'ట్యూబ్ లైట్' మూవీకి యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద గట్టి పోటీనిస్తోంది. దీంతో పలువురు క్రిటిక్స్ బాలీవుడ్ పరిశ్రమకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బాలీవుడ్ ఇకనైనా నిద్ర లేవాలి
‘నిన్న ‘బాహుబలి-2', ఇపుడు ‘దువ్వాడ జగన్నాథమ్'... తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చిత్రాలు భారీ నెంబర్స్ నమోదు చేస్తున్నాయి. డియర్ బాలీవుడ్ ఇకపైనా నిద్ర లేవాలి' అంటూ ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

తొలి రోజు దుమ్మురేపిన డిజె
డిజె మూవీ తొలి రోజు యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే సాయంత్రం 5 గంటల్లోపే $ 526,355 [రూ3.39 కోట్లు] వసూలు చేసింది. అదే రోజు విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్' కూడా ఇన్ని వసూళ్లు సాధించలేదు.

డిజె 11, ట్యూబ్ లైట్ 16
యూఎస్ఏ బాక్సాఫీస్ ... ఇండియన్ మూవీస్ ఓపెనింగ్ డే కలెక్షన్ల విషయంలో ‘డిజె-దువ్వాడ జగన్నాథమ్' 11వ స్థానంలో ఉండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘ట్యూబ్ లైట్' మూవీ 16వ స్థానంలో ఉంది.

బాహుబలి-2 టాప్
2017 సంవత్సరంలో విడుదలైన ఇండియన్(హిందీ రిలీజ్) సినిమాల్లో ఇండియన్ బాక్సాఫీసు వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో బాహుబలి-2 టాప్ పొజిషన్లో ఉంది. ఈచిత్రం తొలి రోజు రూ. 41 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











