(మా)...శివాజీరాజా, ఉత్తేజ్ ఔట్: రాజేంద్రుడికి 'మెగా షాక్'
హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ‘మా' అధ్యక్ష పదవికి కోసం సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా చీలి పోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వర్గం రాజేంద్రప్రసాద్ను రంగంలోకి దింపగా......దాసరి నారాయణరావు వర్గం జయసుధను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు.
కాగా.....రాజేంద్రప్రసాద్ ప్యానెల్కు బుధవారం భారీ షాక్ తగిలింది. ఈ ప్యానెల్ నుండి శివాజీ రాజా, ఉత్తేజ్ తప్పుకున్నారు. శివాజీ రాజా ‘మా' ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఉన్నట్టుండి తప్పుకున్నారు. అయితే వీరు ఎందుకు పోటీ నుండి తప్పుకున్నారనే విషయం తేలలేదు. ఈ విషయమై స్పందించేందుకు రాజేంద్రప్రసాద్ నిరాకరించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ నుండి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఓ. కళ్యాణ్, ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, కోశాధికారిగా చక్రపాణి, సంయుక్త కార్యదర్శులుగా భూపాల్, ఉత్తేజ్ పోటీ పడుతున్నారు. ఈ ప్యానెల్ నుండి శివాజీ రాజా, ఉత్తేజ్ తప్పుకోవడం చర్చనీయాశం అయింది.

మరో వైపు జయసుధ ప్యానెల్ ప్రముఖులతో బలంగా కనిపిస్తోంది. ఈ ప్యానెల్ తరుపున తనికెళ్ల భరణి(కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు), అలీ (కార్యదర్శి), పరుచూరి వెంకటేశ్వరావు(కోశాధికారి), నరేష్, రఘు బాబు(సంయుక్త కార్యదర్శులు), చార్మి, ఢిల్లీ రాజేశ్వరి, గీతాంజలి, హేమ, జయలక్ష్మి, నిర్మల, శివ పార్వతి, బెనర్జీ, బ్రహ్మాజీ, హరినాథ్ బాబు, జాకీ, కృష్ణుడు, మహర్షి రాఘవ, నర్సింగ్ యాదవ్, రాజీవ్ కనకాల, శ్రీశశాంక, శ్రీనివాస్ పసునూరి, విద్యాసాగర్(కార్యవర్గ సభ్యులు)గా పోటీలో ఉన్నారు. ఇప్పటికే జయసుధ ప్యానల్ నుండి ఉపాధ్యక్షులుగా శివకృష్ణ, మంచు లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సీనియర్ నరేష్ ఇవాళ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. తమ ప్యానల్ సభ్యులను భయపెట్టడానికి కొందరు... రాజకీయ నేతలను ఆశ్రయించారని, అయితే తాము ఎవరికి లొంగేది లేదని, చిత్రసీమ యావత్తు తమ వెనకే ఉంద'ని నరేష్ ట్వీట్ చేశారు. దాంతో... జయసుధ ప్యానెల్ ను భయపెట్టింది ఎవరు ? ఏ రాజకీయ నేతతో ప్రత్యర్థి వర్గం వారు బెదిరించారు ? అనే విషయమై ఫిల్మ్ నగర్ లో హాట్ హాట్ డిస్కషన్ మొదలైంది. రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ ను నాగబాబు సపోర్ట్ చేస్తుండగా, జయసుధ బృందానికి మురళీమోహన్ మద్దతు ప్రకటించారు. నాగ బాబు వెనక చిరంజీవి, మురళీ మోహన్ వెనక దాసరి ఉండి చక్రం తిప్పుతున్నట్లు టాక్. మరి ఈ నెల 29న జరిగే ఎన్నికలో గెలుపోటములు తేలనున్నాయి.


Click it and Unblock the Notifications











