రిటైర్మెంట్ ప్రకటించిన సంగీత దర్శకుడు కీరవాణి
హైదరాబాద్: సౌతిండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎంఎం. కీరవాణి ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఆయన రిటైర్మెంటుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈ రోజు తన అఫీషియల్ సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా రిటైర్మెంట్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 8, 2016న తాను సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేసారు.
కీరవాణి తన ట్విట్టర్ పేజీలో ఈ విషయమై ప్రస్తావిస్తూ...'నా కెరీర్లో ఫస్ట్ సాంగ్ డిసెంబర్ 9, 1989లో చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో రికార్డు చేసాను. డిసెంబర్ 8, 2016వ తేదీన రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. నా క్లోజ్ అసోసియేట్స్, మ్యూజీషియన్స్తో కలిసి హైదరాబాద్లోని ప్రసాద్ స్టూడియోలో రిటైర్మెంట్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలనుకుంటున్నాను. ఇందుకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది' అని కీరవాణి పేర్కొన్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా 1987లో కెరీర్ ప్రారంభించిన కీరవాణి....1990లో వచ్చిన 'మనసు మమత' చిత్రం ద్వారా సొంతగా మ్యూజిక్ కంపోజింగ్ మొదలు పెట్టారు. రెండున్నర దశాబ్దాల తన కెరీర్లో ఇప్పటి వరకు 200లకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ చిత్రాలకు కూడా ఆయన సంగీతం అందించారు.
కీరవాణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు, నాలుగు సౌతిండియా ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు తమిళనాడు ప్రభుత్వం నుండి కూడా అవార్డులు అందుకున్నారు. మెలోడీ సంగీతానికి కీరవాణి పెట్టింది పేరు. ఆయన రిటైర్మెంట్ డేట్ ప్రకటించడం సంగీత అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. ప్రస్తుతం ఆయన 'అనామిక', 'బాహుబలి' చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











