దిల్ రాజు ఆధ్వర్యంలో హీరోలపై వేటు...
నిర్మాణ వ్యయాన్ని అదుపు చేసే అంశమ్మీద ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలోని ఓ కమిటీ వేయనున్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా నిర్మాతల మండలి త్వరలోనే ఓ చర్చ జరుపుతుందని సమాచారం. అదుపు తప్పుతున్న సినిమా నిర్మాణ వ్యయానికి కళ్లెం వేసే దిశగా ఈ కమిటీ పనిచేస్తుంది. అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు కావడం...దాని ఫలితం సినిమా వ్యాపారమ్మీద పడటం నిర్మాతల్ని కలవరపెడుతోంది. ఈ సమస్యలకి కారణాలు అన్వేషించి, ఏ దశలో ఎలా ఖర్చు తగ్గించుకోవచ్చో అనే విషయమ్మీద ఓ కమిటీ ఏర్పడింది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో మంగళవారం దీనిపై చర్చ మొదలైంది.
పారితోషికాలు, నటుల వ్యక్తిగత సిబ్బంది వ్యయం, వసతి ఖర్చులు, మేకప్ వ్యాన్ భారం...తదితర అంశాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. చిత్రీకరణ దశలో పొదుపు చర్యలు ఎలా తీసుకోవచ్చో అనే విషయం గురించి ఆలోచిస్తున్నారు. అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ను కనీసం 30 శాతం తగ్గించుకోవాలని నిర్మాతలు అడుగుతున్నారు. అనవసర వ్యయాన్ని తగ్గించాలని, సినిమా నిర్మాణాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని కోరుతున్నారు. ఫిలిం చాంబర్ భవనంలో జరిగిన సమావేశానికి అగ్ర నిర్మాతలు సహా 130 మందికిపైగా హాజరయ్యారు. ఈ సమావేశం మూడు గంటల పాటు ఆద్యంతం వాడివేడిగా సాగింది. కొంత మంది నిర్మాతలు అవసరమైతే సినిమా షూటింగ్లు నిలిపేద్దామని సూచించారు.


Click it and Unblock the Notifications











