విశ్వరూపం బ్యాన్ : సెటిల్మెంట్ చేసుకోవాలన్న మద్రాస్ కోర్టు
చెన్నై : కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన 'విశ్వరూపం' చిత్రంపై ముస్లిం సంఘాల ఫిర్యాదు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆ చిత్రంపై 15 రోజుల బ్యాన్ విధించడం, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేయడం తెలిసిందే. అయితే కమల్ హాసన్ కు అనుకూలమైన తీర్పు కోర్టు నుంచి రాలేదు.
సినిమాను చూసిన తర్వాత తీర్పు వెలువరిస్తామని, అంత వరకు సినిమా ప్రదర్శన తమిళనాడులో నిలిపి వేయాలని కోర్టు తెలిపింది. తాజాగా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి 'విశ్వరూపం' సినిమాను శనివారం వీక్షించారు. నిన్న ఆదివారం కావడంతో ఈ రోజు కోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సినిమా ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా లేదనే విధంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సమస్యను చర్చల ద్వారా సానుకూలంగా పరిష్కరించుకోవాలని కమల్ హాసన్ కు కోర్టు సూచించింది. ఈ మేరకు ఈ రోజు తమిళనాడు ప్రభుత్వ అధికారులతో కమల్ హాసన్ చర్చలు జరుపనున్నారు.
కాగా...తమిళనాడు మినహా అన్ని చోట్లా విశ్వరూపం చిత్రం ఈ నెల 25నే విడుదలైంది. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. తమిళనాడులో బ్యాన్ సమస్య ఎదుర్కొంటున్న కమల్ హాసన్ కు రజనీకాంత్, దాసరి నారాయణరావు, రాజమౌళితో పాటు సినీ ప్రముఖులందరి నుంచి మద్దతు లభిస్తోంది. సెటిల్మెంట్ ద్వారా సమస్య పరిష్కరించుకోవాలన్న కోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











