చక్రి మృతి: వెక్కి వెక్కి ఏడ్చిన ఉదయభాను, దాసరి నివాళి
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణవార్త టివి యాంకర్, నటి ఉదయభాను వెక్కి వెక్కి ఏడ్చేశారు. చక్రి ఈ మధ్య కాలంలో చాలా లావుగా అయిపోయారని, అయినా కూడా ఆయనకు రకరకాలుగా డ్రస్సులు వేసుకోవడం ఆయనకు ఇష్టమని చెప్పారు. నాలుగు అడుగులు వేసినా బాగా ఆయాపడుతున్నారని, అది చూసి కొంతమంది ఆయన ఉన్నంతసేపు ఊరుకుని వెళ్లగానే వెనకాల రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత లావుగా ఉంటే ఆరోగ్యం ఏమయిపోతుందని, హ్యాపీగా, హెల్దీగా ఉండాలని ఆయనకు చెప్పేదాన్నని కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే ఉన్నట్టుండి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఆయన మీద చాలామంది విమర్శలు చేశారని, కానీ అంత మంచి హృదయం ఉన్నవాళ్లు మళ్లీ దొరకడం కష్టమని ఉదయభాను చెప్పారు. ఆయన లేని బాధను తాను మాటల్లో చెప్పలేనని, మనస్ఫూర్తిగా ' చక్రీ.. వియ్ మిస్ యు' అని మాత్రమే అనగలనని ఉదయభాను తెలిపారు.

ఇంత చిన్న వయస్సులోనే..
ఇంత చిన్న వయసులోనే చక్రి మృతి చెందటం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఆయన సోమవారం చక్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం దాసరి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఎర్రబస్సు చిత్రానికి చక్రి సంగీతం అందించాడని, నిజంగా ఇన్నిరోజులు అతన్ని ఎందుకు మిస్ అయ్యానా అని అనుకున్నట్లు చెప్పారు.

భవిష్యత్తులో అతనితో మరిన్ని సినిమాలు చేయవచ్చు అని అనుకున్నానని.. అయితే హఠాత్తుగా చక్రి జీవితం ఇలా ముగిసిపోతుందని అనుకోలేదన్నారు. చక్రి తనను తండ్రిగా భావించేవాడని, చివరి రోజుల్లో చాలా దగ్గరగా కలిసి ఉన్నామని దాసరి అన్నారు. చక్రీ వాయిస్ అంటే తనకు చాలా ఇష్టమని.. చక్రి వాయిస్ వినిపించడయ్యా అని అనేవాడినని..స్నేహపాత్రుడు...అందరికి కావలసినవాడు అని అన్నారు.


Click it and Unblock the Notifications











