‘లింగా’ సినిమా....బాధితులకు 10 కోట్ల పరిహారం!
హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘లింగా'. రజనీకాంత్ సినిమా కావడంతో భారీగా ధర చెల్లించి కొనుగోలు చేసారు డిస్ట్రిబ్యూటర్లు. అయితే సినిమా నెగెటివ్ టాక్ రావడంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు నష్టాల పాలయ్యారు. గత కొంత కాలంగా తమకు పరిహారం ఇప్పించాలంటూ డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన సాగుతూనే ఉంది.
ఎట్టకేలకు ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాత రాక్లైన్ వెంకటేష్ రూ. 10 కోట్లు పరిహారం కింద డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వడానికి సిద్ధమయినట్లు సమాచారం. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు మధ్య మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. తొలి దశ చర్చల్లో రూ. 33 కోట్లు పరిహారం ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేసారు. అయితే నిర్మాత రూ. 3 కోట్లు ఇస్తానని చెప్పాడు.

రెండో దశ చర్చల్లో డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతపై రాజకీయ పరమైన ఒత్తిడి తెచ్చి రూ. 24 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అయితే నిర్మాత 7 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోక పోవడంతో చర్చలు విఫలం అయ్యాయి. తాజాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల మధ్య మూడో దఫా చర్చలు జరిగాయి.
మూడోసారి చర్చల్లో డిస్ట్రిబ్యూటర్లు కనీసం రూ. 16.5 కోట్లయినా ఇవ్వాలని, లేకుంటే తమ నష్టాలు తీరే అవకాశం లేదని కోరారు. అయితే చివరకు నిర్మాత రూ. 10 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇచ్చిన మొత్తాన్ని తీసుకునేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.
కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ‘లింగా' చిత్రం డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. అనుష్క, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అంచనాలు భారీగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా రేటు పెట్టి కొన్నారు. అయితే కొన్ని చోట్ల ఈ చిత్రం నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.


Click it and Unblock the Notifications











